డాక్టర్ కె.వి.సుబ్రమణియన్,
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారుడు
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన తాజా బడ్జెట్ ఎప్పటికీ మరిచిపోలేనిది. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలు తీసుకొచ్చి, వాటి అమలుకు చిత్తశుద్ధితో పని చేయడం వల్లే కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్ధిక వ్యవస్థ కనిష్ట ప్రభావంతో బయటపడి వీ షేప్ రికవరీ దిశలో వెళ్తోంది. ఇటువంటి కీలకసమయంలో వచ్చిన బడ్జెట్లో వృద్ధి రేట్ పెంపుతో పాటు 2021తో మొదలైన పదేళ్లలో అభివృద్ధికి బాటలు వేసేలా విధానాలను ఆర్ధిక మంత్రి తెచ్చారు.
ఆర్ధిక సంరక్షణకు పెద్ద పీట వేస్తూ, 137% కేటాయింపులు పెంచారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన డబ్బు సమకూరేలా కేటాయింపులు జరిపారు. ఉద్యోగాలు పెంచాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ముఖ్యం. దీంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 32 శాతం అదనపు నిధులు ఇచ్చారు.
పన్నులను పెంచకపోవడంతో ప్రజలపై బరువువేయని బడ్జెట్గా చరిత్రలో మిగిలిపోతుంది. ఎకానమీ వేగంగా రికవరీ కావడం కోసం ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచారు. క్లిష్ట పరిస్థితుల మధ్య భారత క్రికెటర్ రిషభ్ పంత్ సుడిగాలి ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియాలో భారత జట్టును గెలిపించిన తరహాలో నిర్మల తన బడ్జెట్ రూపొందించారు. అంటే మన ఎకానమీ తొందరగా కోలుకునేలా అనేక చర్యలకు ఆమె శ్రీకారం చుట్టారు.
కరోనా సమయంలో సంక్షోభంలో పడిపోయిన ఎకానమీని గాడిన పెట్టడమే లక్ష్యంగా కొత్త బడ్జెట్ నడిచింది. ప్రజలపై బరువు పెట్టకుండానే, ప్రభుత్వ ఖర్చుపెంచి, తద్వారా వృద్ధి కలిగించే చేసే ప్రయత్నం ఆర్ధిక మంత్రి చేశారు. ప్రభుత్వం చేతిలో లిక్విడిటీని పెంచడం కోసం కొత్త మార్గాలను ఎంపిక చేసుకున్నారు.
పన్ను వ్యవస్థను క్రమబద్దం చేయడం, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా కంపెనీని ప్రైవేటుకు అప్పచెప్పాలనే నిర్ణయాలు తీసుకున్నారు. నాన్పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ)ల బెడద తగ్గించేందుకు బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలనే కొత్త ప్రతిపాదననూ ముందుకు తెచ్చారు. ఎన్పీఏలతో నష్టాల్లో కూరుకుపోయిన బ్యాంకులకు ఇది పెద్ద రిలీఫ్.
వృద్ధికి ఊపందించే విధానాలు
ఎకానమీ ముందుకు వెళ్లాలంటే , లేబర్, క్యాపిటల్ (పెట్టుబడి), మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం. అయితే లేబర్, పెట్టుబడి సాయంతో ఉత్పత్తిని పెంచాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. ఇందులోనూ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా భౌతిక ఆస్తులు, సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మానవ వనరులు అవసరం. కరోనా మహమ్మారి ఏ ఎకానమీ నిలబడాలన్నా ఆరోగ్య రంగం కీలక పాత్ర వహించే అంశాన్ని ఎత్తి చూపింది.
దీంతో ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ అనేది కూడా సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రధానమైన అంశంగా మారింది. సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేబర్, క్యాపిటల్ రిసోర్సెస్ను ఎకానమీకి సమకూర్చేలా తగిన నిర్ణయాలను బడ్జెట్లో ఆర్ధిక మంత్రి తీసుకున్నారు. ఎకానమీని గాడిలో పెట్టడమే కాకుండా, వృద్ధి ఊపందుకునే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి కాబట్టే, ఆర్ధిక మంత్రి తెచ్చిన ఈ బడ్జెట్ మర్చిపోలేనిదవుతుంది.
భౌతిక మౌలిక సదుపాయాలపై పెట్టే పెట్టుబడులు దేశ ఎకానమీకి బలమైన పునాదులు వేయడంతోపాటు, వృద్ధి రేటు ఊపందుకునేలా చేయగలుగుతాయని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ’ (ఎన్ఐపీఎఫ్పీ) స్టడీ ఒకటి స్పష్టం చేస్తోంది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపీ) కోసం కేటాయించిన రూ. 5.54 లక్షల కోట్లు మన ఎకానమీ భవిష్యత్కు చాలా ఉపయోగపడతాయి.
ఈ పెట్టుబడులు జీడీపీలో 2.5 శాతానికి సమానం. ఎన్ఐపీలో పెట్టే ఈ పెట్టుబడులతో 6.25 శాతం వృద్ధి సాధించడం సులభమవుతుంది. కిందటి ఏడాది అక్టోబరు నుంచి ప్రభుత్వం తన క్యాపిటల్ వ్యయాన్ని భారీగా పెంచింది. 2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.4.2 లక్షల మేర కేటాయింపును ఈసారి అంచనాల్లో సవరించి రూ.4.39 లక్షల కోట్లు చేశారు. లాక్డౌన్ సమయంలో క్యాపిటల్ వ్యయంపై గండిపడింది. అయినా కూడా, బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 4.5 శాతం దాకా పెంపుదల కనబడటం విశేషం.
ఉత్పత్తి పెంచే చర్యలు
రోడ్లు, రైల్వేలకు కేటాయింపులు ఎక్కువ చేసినందు వల్ల దేశంలో రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. ఫలితంగా దేశంలోని కంపెనీల వ్యాపార కార్యకలాపాల్లో ఖర్చు ఆదా అవుతుంది. కార్మిక సంస్కరణలు, ‘ఎంఎస్ఎంఈ’ డెఫినిషన్స్లో మార్పులు, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము సహా ఆత్మనిర్భర ప్యాకేజీలు 1 నుంచి 3 కింద చేపట్టిన అనేక చర్యలకు తోడుగా ఇవన్నీ తాజాగా ప్రకటించారు.
వీటన్నిటివల్ల దేశంలో ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఇక ప్రభుత్వ రంగంలో కొత్తగా డెట్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు, ప్రైవేటు రంగంలోనూ అటువంటి సంస్థల ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ వ్యయ కేటాయింపులకు అదనంగా ఆర్ధిక వనరులను సమకూర్చుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుంది.
చరిత్ర గుర్తుంచుకునేలా..
ఈ ఏడాది బడ్జెట్లో మరో మూడు కీలక నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇందులో మొదటిది ‘బ్యాడ్ బ్యాంక్ ’ ఏర్పాటు. బ్యాంకులలో నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ)కు తగిన విలువ కల్పించేలా చొరవకు ఈ బ్యాడ్ బ్యాంక్ సాయపడుతుంది. బ్యాడ్ బ్యాంకు ప్రైవేటు రంగంలోనే ఏర్పాటవుతుంది. రెండోది రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక బీమా కంపెనీ ప్రైవేటీకరణ ప్రతిపాదన. ఇందుకోసం అవసరమైన మేరకు చట్టాల్లో మార్పులు చేస్తారు.
చివరిది బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడం. మొత్తంమీద భారత ఆర్థిక వ్యవస్థ కోవిడ్కు ముందు దశకు చేరగలగడమే కాకుండా రాబోయే పదేళ్ల కాలంలో వేగంగా ఎదగడానికి కూడా ఈ దశాబ్దపు తొలి బడ్జెట్ దిశా నిర్దేశం చేస్తోంది. ఆర్థిక మంత్రిగారూ… మీరు మీ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. చరిత్ర గుర్తుంచుకునే బడ్జెట్ను తెచ్చారు.
భవిష్యత్తుకు మేలు చేసేలా ఆరోగ్యంకు నిధులు
ఆరోగ్య సంరక్షణపై ఖర్చును భారీగా పెంచిన ఫలితం భవిష్యత్లో మనకు స్పష్టం కానుంది. వ్యాక్సిన్ కోసం రూ.35 వేల కోట్ల కేటాయింపు చాలా ముఖ్యమైన నిర్ణయమే. ఈ ఏడాదిలో ఇంకా అవసరమైతే, మరిన్ని నిధులిస్తామన్న హామీ ఎకానమీకి కూడా వ్యాక్సిన్ అవుతుంది. డిమాండ్ పెరిగే వీలును ఈ నిర్ణయం కల్పిస్తుంది.
అంటే, వ్యాక్సిన్ కోసం వెచ్చిస్తున్న ఖర్చు ప్రభావం మనకు ఈ ఏడాదిలోనే కనిపిస్తుంది. ఆరోగ్య సంరక్షణ కోసం సమగ్రమైన దృష్టితో ఆత్మనిర్భర భారత్ ఆరోగ్య పథకం ద్వారా కృషి చేయనున్నారు. ఆరోగ్య సంరక్షణపై ఇప్పుడు పెట్టే ఖర్చు ఫలితాలు ఆలస్యంగానైనా తెలుస్తాయి. మెరుగైన ఆరోగ్యం ఉంటే, కార్మిక శక్తిలో ఉత్పాదికత పెరుగుతుందనేది తెలిసిందే.
(v6 వెలుగు నుండి)

More Stories
భారతీయ ఉగ్రవాదులతో ఖలీదా జియాకు వివాదాస్పద సంబంధాలు!
చిచ్చు రేపిన సల్మాన్ ఖాన్ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’
జపాన్ ను అధిగమించి నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్