కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి సమక్షంలో పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు బంగారు ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేశారు.
ఈ పవిత్ర ధ్వజారోహణ ఘట్టం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సమస్త జీవరాశులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం సంప్రదాయం. ఈ వేడుకతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. బ్రహ్మోత్సవాల తొలి రోజే రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు.
సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో సీఎం వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కోడలు నారా బ్రహ్మణి ఉన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం, ముందుగా బేడి ఆంజనేయస్వామివారిని దర్శించుకుంది.
ఆ తర్వాత పవిత్ర పట్టువస్త్రాలను తలపై ధరించి, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రవేశం చేశారు. నిర్ణీత ముహూర్తంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం గర్భాలయంలోని మూలవిరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేదాశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలు ప్రసాదించారు.
దేశం, రాష్ట్రం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, అభివృద్ధిలో ముందుండేలా స్వామివారు ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
శ్రీవారి సేవలోప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో భక్తులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మన ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని రాబోయే తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం శ్రీవారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొని స్వామివారి వైభవాన్ని దర్శించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పలువురు ప్రముఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ వేడుకల్లో ప్రత్యేకంగా దర్శనమిచ్చారు.

More Stories
ఏపీలో ఆలయాల అభివృద్ధికి రూ.908 కోట్లు
సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
యూట్యూబర్ నందనని నాలుగు గంటల విచారణ