దసరాకు విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ

దసరాకు  విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ
దసరాకు కొత్త రాజకీయ పార్టీని, పార్టీ అజెండాను ప్రకటిస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలోనే తమ పార్టీ ఉంటుందని చెబుతూ వైసీపీ, టీడీపీ తమకు శత్రువులు కాదన్న విజయసాయిరెడ్డి కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని చెప్పారు.  అలాగే తాను స్థాపించే రాజకీయ పార్టీ తరుఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండటం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.  తన పార్టీలో ఎవరికి సామర్థ్యం ఉంటుందో వారే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని, తాను వెనుక ఉండి నడిపిస్తానని తెలిపారు.   

ఏపీలో 15 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ చుట్టూనే రాజకీయం తిరుగుతోందని, ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ రెడ్‌బుక్‌ పాలన కొనసాగిస్తుండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీ రప్పా రప్పా పార్టీలను నడిపిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ , వైసీపీ పార్టీలు రాష్ట్రానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రెండు రాజకీయ పార్టీలే పాలించాలా, రెడ్డు, కమ్మలే సీఎంలు కావాలా? అని ప్రశ్నించారు. 

త్వరలో తాను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నయంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు.   ఏపీలోని ఆరు కోట్ల ప్రజానీకాన్ని, రాష్ట్ర సంపదను ఏ పార్టీ దోచుకోవాలనే హక్కు కోసం ఈ రెండు పార్టీలు కృషి చేస్తున్నాయని విజయ సాయిరెడ్డి విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఫ్యాక్షన్ కుటుంబ రాజకీయ పార్టీలని విమర్శించారు. వీరిద్దరి అజెండా ఒక్కటేనని ప్రజలకు గోరంత… తమకు కొండంత అనే విధంగా వ్యవహారిస్తాయని విజయ సాయిరెడ్డి విమర్శించారు.

మరోవైపు తాను రాజకీయంగా మౌనంగా లేనన్న విజయసాయిరెడ్డి ఏడాది పాటు పరిశోధన చేసి ‘రెడ్డి’ సామాజికవర్గం ఎలా ఆవిర్భవించిందనే అంశంపై సుమారు 350 పేజీలతో పుస్తకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అలాగే తాను రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదని, ఇష్టం ఉన్నా, లేకపోయినా అమరావతికి మద్దతు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆహ్వానించాలని, ప్రభుత్వ సొమ్మును వృధా చేయకూడదని ఆయన సూచించారు.

ఇక తమ పార్టీలో 66 శాతం పదవులు యువతకే కేటాయిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోలియంపై జీఎస్టీని 15 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డీఎస్సీ, ఏపీపీఎస్సీలపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి అనుమానాలు నివృత్తి కావాలంటే ఈ కేసులను సీబీఐకు అప్పగించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.