దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులు గత 11 ఆర్థిక సంవత్సరాలలో భారతదేశంలోని బ్యాంకులు రూ. 9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయని, అయితే ఈ చర్య రుణగ్రహీతల బాధ్యతల నుండి విముక్తి కాదని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది. లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు నిరర్థక ఆస్తులను (ఎన్పీఏలను) మాఫీ చేస్తాయని తెలిపారు.
“ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానాల ప్రకారం, నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి ప్రొవిజనింగ్ చేసిన వాటితో సహా ఎన్పీఏలను బ్యాంకులు మాఫీ చేస్తాయి. ఇలా మాఫీ చేయడం వల్ల రుణగ్రహీతల బాధ్యతలు మాఫీ కావు,” అని మంత్రి పేర్కొన్నారు. మాఫీ చేసిన తర్వాత కూడా రుణగ్రహీతలు తిరిగి చెల్లించడానికి బాధ్యత వహిస్తారని, బ్యాంకులు వివిధ చట్టపరమైన, సంస్థాగత యంత్రాంగాల ద్వారా వసూలు ప్రయత్నాలను కొనసాగిస్తాయని ఆయన నొక్కి చెప్పారు.
పార్లమెంటులో పంచుకున్న డేటా ప్రకారం, ఇటీవలి సంవత్సరాలలో తగ్గుముఖం పట్టడానికి ముందు, 2010ల చివరలో మాఫీల పరిమాణం గణనీయంగా పెరిగింది. రిజర్వుబ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అతిపెద్ద ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ల రుణాలు 2024-25లో రూ.63,19,057 కోట్లు ఉండగా, గడిచిన ఏడాది చివరినాటికి రూ.69,21,734 కోట్లకు చేరాయని వెల్లడించారు.
సంక్షోభంలో ఉన్న రుణ గ్రహీతలకు ఉపశమనం కల్పించేందుకు రిజర్వుబ్యాంక్ ఒత్తిడికి గురైన ఆస్తుల పరిష్కారంపై మాస్టర్ డైరెక్షన్-2025ను గతేడాది నవంబర్ 28న జారీ చేసింది. ఇతర విషయాలతోపాటు రుణదాతలు తమ బోర్డు ఆమోదించిన విధానాలు, నియంత్రణ మార్గదర్శకాల ఆధారంగా, ఒత్తిడిలో ఉన్న రుణ గ్రహీతల ఆర్థిక పునర్వ్యవస్థీకరణను చేపట్టేందుకు విచక్షణాధికారాన్ని కల్పిస్తున్నదని చౌదరి పేర్కొన్నారు.
మరోప్రశ్నకు ఆయన సమాధానమిస్తే ద్రవ్యలోటును కట్టుదిట్టం చేయగలిగామని, 2020-21లో దేశ జీడీపీలో 9.2 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2025-26లో 4.4 శాతానికి తగ్గించగలిగామని తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, ఆస్తుల నగదీకరణతో రూ.45, 306 కోట్ల నిధులు సమకూరినట్టు పంకజ్ చౌదరి వెల్లడించారు. 2025-26 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో రూ.33,837 కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
2025-26లో సేకరించిన రూ.45,306 కోట్ల నిధుల్లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.16,885.56 కోట్లు, ఆస్తుల నగదీకరణ ద్వారా మరో రూ.28,420.49 కోట్లు సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.59,083 కోట్లు సమీకరించింది. వీటిలో సెంట్రల్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎల్ఐసీ, ఎన్హెచ్పీసీ, ఎన్ఎల్సీ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, కొచ్చిన్ షిప్యార్డ్, ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్లలో వాటాలను విక్రయించింది.
సుంకాల పెంపుతో 10,463 కోట్లు
బంగారంతోపాటు వెండిలపై దిగుమతి సుంకం పెంపుతో కేంద్ర ఖజానాకు రూ.10 వేల కోట్లకు పైగా నిధులు జమయ్యాయి. మే 13 నుంచి ఆగస్టు 2 వరకు ఈ రెండు అతి విలువైన లోహాలతోపాటు ప్లాటినంపై దిగుమతి సుంకం పెంపుతో రూ.10,463 కోట్లు వచ్చాయని పంకజ్ చౌదరి తెలిపారు. బంగారంతోపాటు వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి సవరించగా, ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. ఈ పెంపు మే 13 నుంచి అమలులోకి వచ్చింది.

More Stories
ఈ20 పెట్రోల్లో అధిక క్లోరైడ్ లేదా నీటి కాలుష్యం ఆధారాలు లేవు
రవాణా బస్సులు లేని 400కు పైగా భారతీయ నగరాలు
`అజిత్ దోవల్ రహస్య ఏజెంట్’గా రూ 100 కోట్ల ఆస్తులతో నకిలీ ఐఏఎస్