ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి

ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి
పాకిస్తాన్ వాయువ్య ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో రాత్రిపూట ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఒక భద్రతా చెక్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లడంతో, సైనికులు, పోలీసు సిబ్బంది, ఒక ప్రభుత్వ అధికారితో సహా కనీసం 15 మంది మరణించారని సైన్యం తెలిపింది. సైన్యం మీడియా విభాగం ప్రకారం, మృతులలో 12 మంది సైనికులు, ఇద్దరు పోలీసు సిబ్బంది, అటవీ శాఖకు చెందిన ఒక ప్రభుత్వ అధికారి ఉన్నారు. దేశాన్ని రక్షిస్తూ వారు షహాదత్ (అమరత్వం) పొందారని సైన్యం అభివర్ణించింది. 
 
ఈ దాడి ట్యాంక్ జిల్లాలో జరిగింది. అక్కడ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఒక భద్రతా చెక్‌పోస్ట్ ప్రహరీ గోడలోకి నడపడంతో, శక్తివంతమైన పేలుడు సంభవించి ఆ ప్రాంగణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ దాడిలో భద్రతా దళాలు ఎదురుదాడి చేసి 12 మంది ఉగ్రవాదులను హతమార్చాయని సైన్యం తెలిపింది.  ఈ దాడికి తామే బాధ్యులమని ఏ గ్రూపు కూడా వెంటనే ప్రకటించలేదు.
అయితే, ఈ ప్రాంతంలో తీవ్రవాద హింస విపరీతంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీపీటీ) అని చెబుతున్నారు. ఈ సంస్థ ఇటీవలి సంవత్సరాలలో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దాడులను తీవ్రతరం చేసింది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి పనిచేస్తున్న తీవ్రవాదులే ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్‌లలో దాడులను నడిపిస్తున్నారని పాకిస్థాన్ పదేపదే ఆరోపించింది. 

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది, కానీ ఈ ఆరోపణలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి కారణంగా, ఆఫ్ఘనిస్తాన్‌లోని తీవ్రవాదుల స్థావరాలుగా తాము చెబుతున్న వాటిని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడులు కూడా జరిపింది. జూన్‌లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్థాన్ జరిపిన తాజా దాడులలో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని తాలిబాన్ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి తెలిపాయి.

జూలై 22న, అశాంతి నెలకొన్న మరో ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లలో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు, ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లను అరెస్టు చేశారు. పాకిస్తాన్ సైనిక మీడియా విభాగం ప్రకారం, సురబ్ జిల్లాలో ఏడుగురు ఉగ్రవాదులు, మస్తుంగ్ జిల్లాలో మరో ముగ్గురు హతమయ్యారు. మస్తుంగ్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లతో పాటు, వారికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కూడా పట్టుకున్నారు. 

బలూచిస్తాన్‌లో ఉగ్రవాదులపై కొనసాగిస్తున్న పోరాటంలో భాగంగానే ఈ ఆపరేషన్లు నిర్వహించినట్లు సైన్యం తెలిపింది. పలు నిఘా ఆధారిత లక్షిత దాడులు, ప్రాంత నిర్మూలన ఆపరేషన్ల సందర్భంగా భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల అనుమానిత స్థావరాలపై దాడి చేసి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ నెల మొదట్లో, జూలై 6న జియారత్‌లోని మంగి డ్యామ్ పంపింగ్ స్టేషన్ వద్ద ఉన్న పోలీస్ పోస్ట్‌పై జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పోలీసు సిబ్బంది మరణించిన నేపథ్యంలో, భద్రతా దళాలు, చట్ట అమలు సంస్థలు ‘ఆపరేషన్ షబాన్’ను ప్రారంభించాయి.