షిండే వర్గంలో యుబిటి ఎంపీల విలీనానికి ఆమోదం

షిండే వర్గంలో యుబిటి ఎంపీల విలీనానికి ఆమోదం

* టీఎంసీ రెబల్స్​కు ప్రత్యేక సీట్లు

శివసేనలోని (యుబిటి) ఆరుగురు ఎంపీలు శివసేనలో (షిండే వర్గం) విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం ఆమోదం తెలిపారు. దీంతో ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలు ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనలో విలీనమైనట్లు అధికారికంగా గుర్తించారు. దీంతో లోక్‌సభలో శిందే శివసేన బలం 13 మంది ఎంపీలకు పెరగ్గా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు (యూబీటీ- ఉద్ధవ్ బాల్ ఠాక్రే) ముగ్గురు ఎంపీలే మిగిలారు. 

అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నుంచి విడిపోయి ‘నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)’ లో విలీనమైనట్లు ప్రకటించిన 20 మంది రెబల్ ఎంపీలకు లోక్‌సభలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా స్పీకర్ అనుమతి ఇచ్చారు. అయితే వారి పార్టీ విలీనాన్ని మాత్రం ఇంకా అధికారికంగా గుర్తించలేదు. కానీ లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్‌తో కాకుండా వేరుగా కూర్చునేందుకు అనుమతిని ఇచ్చారు. 

గత నెలలో టీఎంసీ రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని 20 మంది ఎంపీలు- టీఎంసీని వీడి ఎన్సీపీఐలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. అలాగే శివసేనలోనూ (యుబిటి) చీలిక ఏర్పడి, ఆరుగురు లోక్‌సభ సభ్యులు శివసేనలో (షిండే వర్గం) చేరగా వీటికి సంబంధించి తాజాగా స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయాలు ప్రకటించారు.

లోక్‌సభ సెక్రటేరియట్ టేబుల్ ఆఫీస్ ఇప్పటికే సవరించిన పార్టీ బలాబలాల జాబితాను శనివారం విడుదల చేసింది. శిందే నేతృత్వంలోని శివసేన బలం లోక్‌సభలో 13 మంది ఎంపీలకు చేరగా, దీంతో ఎన్డీయేలో బీజేపీ తర్వాత అత్యధిక మంది ఎంపీలు కలిగిన రెండో మిత్రపక్షంగా నిలిచింది. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి (టిడిపి) 16 మంది ఎంపీలు ఉండగా ఎన్డీయేలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్న మొదటి మిత్రపక్షంగా ఉంది.

ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్పీకర్ సహా లోక్‌‌సభలో ఎన్డీయే బలం 298 కి చేరింది. టీఎంసీ రెబల్ ఎంపీల విలీనానికి కూడా స్పీకర్ ఆమోదం లభిస్తే ఎన్డీయే బలం ఏకంగా 318 కి చేరుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం 540 మంది సభ్యులు ఉండగా, 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడింట రెండొంతుల మెజార్టీకి అవసరమైన సంఖ్యకు ఎన్డీయే మరింత చేరువయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

తిరిగి వస్తే రాజీనామా చేస్తా.. రెబెల్స్ కు అభిషేక్ సవాల్!

అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పార్టీని వీడి వెళ్లిన రెబల్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ దగ్గరికి తిరిగొస్తే తాను ఒక్క గంటలోనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ‘సుమారు 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు పార్టీని వీడారు. మీకు నాపై అభ్యంతరం ఉంటే మధ్యాహ్నం 3 గంటలకు మమతా బెనర్జీ దగ్గరికి తిరిగి రండి. నేను సాయంత్రం 4 గంటలకే రాజీనామా చేస్తాను.’ అని స్పష్టం చేశారు. 
 

మీడియాతో మాట్లాడిన ఆయన తమ నేతలు బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ‘నాపై విమర్శలు చేస్తేనే బీజేపీ, పోలీసుల నుంచి వారికి రక్షణ లభిస్తుందని చెప్పారు. నన్ను తిడితేనే వారు సురక్షితంగా ఉంటారు.’ అని ఎద్దేవా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ బెంగాల్‌లో 29 స్థానాలు గెలిచిందని, పార్టీ ఓటములకు తనను బాధ్యుడ్ని చేస్తే, ఆ విజయానికి కూడా తనకే క్రెడిట్ ఇవ్వాలని స్పష్టం చేశారు.