వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా

వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా
వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా దోహదపడుతుందని చెబుతూ 50 ఏళ్ల వయస్సులో 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉండాలని, 70 ఏళ్లలో ఎక్కువ వ్యాధులను ఎదుర్కోగలగాలి అంటే అది యోగాతోనే సాధ్యపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ యోగా డేలో వేలాది మంది పాల్గొన్నారు. ఉదయం 6:30 గంటలకే ఈ కార్యక్రమానికి చేరుకున్న మోదీ యోగా కేవలం వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచడానికే కాదని, ప్రపంచ భవిష్యత్ కోసం కూడా అవసరమంని చెప్పారు.

“వయస్సు పెరిగినంత మాత్రాన మనిషి సామర్థ్యం తగ్గిపోదు. 50 ఏళ్ల వయస్సులో 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉండాలి. 70 ఏళ్ల వయస్సులో 50 ఏళ్ల కంటే ఎక్కువ వ్యాధులను ఎదుర్కోగలగాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది. యోగా మన శరీరం, మనస్సును అర్థం చేసుకునే జీవితకాల అధ్యయనం లాంటిది” అని మోదీ పేర్కొన్నారు.

యోగా అనేది ప్రపంచాన్ని భారతదేశంతో అనుసంధానించిందని, ఇది మనుషులను ఒక్కటి చేస్తుందని ప్రధాని చెప్పారు. జూన్ 21 ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా మారిందని చెప్పారు. స్వామీ వివేకానంద, రవింద్రనాథ్ ఠాగూర్, శ్రీ అరబిందో వంటి మహనీయులు పుట్టిన గడ్డపై యోగా కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి ఇస్తోందని ప్రధాని తెలిపారు.

భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ యోగా కేవలం శారీరక వ్యాయం కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా మార్గం చూపుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా నేర్పుతుంది అని చెప్పారు. ప్రపంచ శాంతి, మానవ సంక్షేమానికి యోగా దోహదపడుతుందని చెప్పారు. యోగా కేవలం ఒక్కరోజు కార్యక్రమంగా మిగిలిపోకూడదని, మన జీవితంలో ఒక భాగం కావాలని మోదీ పిలుపునిచ్చారు.

`మన శరీరాలను దృఢంగా తీర్చిదిద్దడంలో యోగా సహాయపడుతుంది. ప్రశాంతమైన, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికీ సహకరిస్తుంది. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలి. మన గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే, మనల్ని మనం అంత బాగా నిర్వహించుకోగలం’ అని చెప్పుకొచ్చారు.
 
“దేశం, ప్రపంచం అంతా ఒకదానితో ఒకటి అనుసంధానించబడినట్లుగా అనిపిస్తోంది. ఇదే యోగా శక్తి. యోగా అందరినీ కలుపుతుంది, అందరినీ ఏకం చేస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, సమస్త మానవాళికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు యోగా దినోత్సవం సందర్భంగా, బెంగాల్ ప్రజలు చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైన చొరవ,” అని ఆయన కొనియాడారు.