భారత నౌకాదళంలోకి మూడు స్వదేశీ నౌకలు 

భారత నౌకాదళంలోకి మూడు స్వదేశీ నౌకలు 
భారత నౌకాదళ శక్తిని, రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టులో  పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు నౌకలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. స్టెల్త్ యుద్ధ నౌక ‘దూనగిరి’, భారీ సర్వే నౌక ‘సంశోధక్’, జలాంతర్గామి విధ్వంసక నౌక ‘అగ్రే’ లను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. 
 
ఈ మూడు నౌకలు యుద్ధ, సర్వే, జలాంతర్గామి నిరోధక కార్యకలాపాల్లో నౌకాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రక్షణ రంగంలో భారత్ ఇకపై కేవలం కొనుగోలుదారుగా మిగిలిపోదని, మన సైనిక శక్తి ప్రపంచానికి మార్కెట్‌గా మారకూడదని చెప్పారు.  మన బలానికి నిర్వచనం ప్రపంచానికి మార్కెట్‌గా మారడంలో లేదని మన స్వావలంబనలోనే ఉందని చెప్పారు.
ఈ మూడు నౌకలు భారత పరిశ్రమల ప్రతిభకు, ఇంజనీర్ల నైపుణ్యానికి, కార్మికుల కఠోర శ్రమకు నిదర్శనమని, ఇదే నవ భారతానికి ఉన్న అతిపెద్ద బలమని ప్రధాని పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జాతికి అంకితం చేసినప్పుడు సముద్ర శక్తిలో భారత్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి నేటి వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం కొత్త యుద్ధ నౌకలది మాత్రమే కాదని, పెరుగుతున్న భారత స్వావలంబన ప్రయాణం అని ఆయన అభివర్ణించారు. 

ఏ దేశానికైతే బలమైన సముద్ర శక్తి ఉంటుందో, ఆ దేశానికి బలమైన ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం ఉంటుందని, ఈ వాస్తవాన్ని భారత్ బాగా అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతోందని మోదీ తెలిపారు. ఈ నౌకల నిర్మాణంలో సుమారు 200 ఎంఎస్‌ఎంఈల సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఈ ప్రక్రియలో అనేక ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు.

నౌకా నిర్మాణ రంగానికి సంబంధించిన రూ. 70,000 కోట్ల ప్యాకేజీని కూడా ఆయన ప్రస్తావించారు. ‘సాగరమాల’ వంటి కార్యక్రమాలు ఈ విస్తృత ప్రయత్నంలో భాగంగా ఉండగా, భారత్ తన ఓడరేవులను ఆధునీకరిస్తూనే సముద్ర సంబంధిత వ్యవస్థను బలోపేతం చేస్తోందని ఆయన తెలిపారు.

దూనగిరి పేరుగల నౌక అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక. బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ వంటి శక్తిమంతమైన ఆయుధాలు, సెన్సార్లతో దీన్ని తీర్చిదిద్దారు. సుదీర్ఘ సముద్ర కార్యకలాపాలకు అనువుగా, బహుముఖ ఆధిపత్యం ప్రదర్శించేలా దీనిని రూపొందించారు.  సంశోధక్ నౌక ఒక భారీ సర్వే నౌక. తీరప్రాంత, లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి, రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర గర్భ డేటాను సేకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. అటానమస్ అండర్‌వాటర్ వెహికల్స్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ వంటి అధునాతన వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.

ఇక అగ్రే అనే నౌక అర్నాల తరగతికి చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌక. తీరప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేసేందుకు దీన్ని రూపొందించారు. తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, అత్యాధునిక సోనార్ వ్యవస్థలు దీని ప్రత్యేకతలు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత కింద రక్షణ తయారీ రంగంలో భారతదేశం సాధిస్తున్న స్వావలంబనను నొక్కిచెబుతూ, ఈ మూడు ప్లాట్‌ఫారమ్‌లను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది.

ఈ నౌకల ప్రారంభ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి సువేందు అధికారి, భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు.