డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలపై సీబీఐ విచారణ

డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలపై సీబీఐ విచారణ
కూటమి ప్రభుత్వ డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం నిర్వహించిన డీఎస్సీ  ఎంపికలో అనేక అవకతవకలు,అక్రమాలు జరిగాయని పేర్కొంటూ అర్హులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండ లంచాలు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. 

పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న నవీన్‌ అనే వ్యక్తికి ఆ పరీక్షలో టాప్‌ ర్యాంక్‌ రావడం వెనుక ఉన్న మతలాబు ఏమిటని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ప్రధాన పాత్ర అని, అతడిపై విచారణకు చంద్రబాబు ముందుకు రాడని చెబుతూ స్కాంలో లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.  లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసిందని ఆరోపించారు.  కేవలం 16 వేల టీచర్ల భర్తీలో స్కామ్‌లు, లీకులు అనేకం ఉన్నాయని దుయ్యబట్టారు.

వైసీపీ హయాంలో డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించామని వెల్లడించారు. స్పోర్ట్స్‌ కోటాలో పెద్ద స్కాం జరిగిందని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ప్రతిభ ఉన్న వ్యక్తులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే కీలకమైన పనులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయించారని దుయ్యబట్టారు. రేపు ఏదైనా తప్పు బయటపడితే ఆ నెపాన్ని సులువుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై నెట్టేయవచ్చనే కుట్రతోనే ఇలా చేశారని విమర్శించారు.