అభిజిత్ డిప్కే కేజ్రీవాల్ కాదు, ‘కాక్‌రోచ్ ఉద్యమం’ అన్నా ఉద్యమం కాదు

అభిజిత్ డిప్కే కేజ్రీవాల్ కాదు, ‘కాక్‌రోచ్ ఉద్యమం’ అన్నా ఉద్యమం కాదు
అశుతోష్ 
సత్య హిందీ సహ వ్యవస్థాపకుడు, ‘రీక్లెయిమింగ్ భారత్’ గ్రంథ రచయిత
అభిజిత్ డిప్కే అరవింద్ కేజ్రీవాల్ కాదు. అలాగే ‘కాక్‌రోచ్ ఉద్యమం’ అన్నా ఉద్యమం వంటిది కాదు. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ అనే ఈ పరిణామం, అసలు పుంజుకోకముందే చల్లారిపోయినట్లు కనిపిస్తోంది. జూన్ 6న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ ‘కాక్‌రోచ్‌ల’ సమావేశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
 
14 ఏళ్ల క్రితం అన్నా ఉద్యమం మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఎలాగైతే కదిలించిందో, సిజెపి మోదీ ప్రభుత్వాన్ని అలా కదిలించే అవకాశం చాలా తక్కువ. నేటి సోషల్ మీడియా యుగంలో, ప్రపంచవ్యాప్త అనుసంధానత ఉన్న తరుణంలో, కేవలం ఐదు రోజుల్లోనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 2 కోట్ల మందికి పైగా అనుచరులను సంపాదించుకోవడం ద్వారా సిపిజే సంచలనం సృష్టించిందనడంలో సందేహం లేదు.
 
ఇది స్థానిక స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు అనేక కుట్ర సిద్ధాంతాలకు దారితీసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఏదో విదేశీ హస్తం పని చేస్తోందన్న ఊహాగానాలు అధికార వర్గాల్లో గుసగుసలుగా వినిపించాయి. అదే సమయంలో, పేపర్ లీక్‌లు, ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం వంటి సమస్యల వల్ల ప్రజలు అసహనంతో, ఆగ్రహంతో ఉన్న తరుణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రతిపక్ష ప్రచారాన్ని దెబ్బతీయడానికే సిజెపి అనే ఈ పరిణామాన్ని సృష్టించారనే వాదన కూడా బలంగా వినిపించింది.
 
నాకైతే ఇది రెండూ కాదని అనిపించింది; ఈ కాక్‌రోచ్ ఉద్యమాన్ని కేవలం యువతలో పెరుగుతున్న ఆందోళనకు ఒక నిదర్శనంగానూ, మోదీ ప్రభుత్వం సరిదిద్దే చర్యలు తీసుకోకపోతే సామాజిక సంఘర్షణకు దారితీసే అశాంతికి సంకేతంగానూ చూడాలి. ఇది 2011 నాటి చారిత్రాత్మక ఉధృతిని పునరావృతం చేయదని నాకు ఖచ్చితంగా తెలుసు. 
 
దీనికి ముందు రాత్రి, ఈ ‘కాక్‌రోచ్‌లు’ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతారని చాలామంది నాతో అన్నారు. కానీ 2014 నుండి దేశంలో చోటుచేసుకుంటున్న సామాజిక-రాజకీయ మార్పులకు ఇప్పటికీ అలవాటు పడని వర్గం వారే అలా మాట్లాడారు. మోదీ ప్రభుత్వం పోవాలని కోరుకునే ఆ వర్గమే సిజెపి ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. 
 
అయితే, అన్నా ఉద్యమం అనేది భారత చరిత్రలో ఒక అరుదైన ఘట్టమని, అది తరచుగా పునరావృతం కాదని వారు మర్చిపోయారు. అన్నా ఉద్యమాన్ని అంతటి స్థాయికి చేర్చిన మూడు ముఖ్యమైన అంశాలు నేటి సిజెపి  కార్యక్రమంలో లోపించాయి. మొదటిది, అరవింద్ కేజ్రీవాల్ మేధస్సు, ఆయన నెలల తరబడి చేసిన ప్రణాళిక, సన్నాహాలు. 
 
కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా పౌర సమాజానికి చెందిన ప్రముఖులతో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అన్నా హజారే జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కూర్చోవడానికి ముందు, ఈ బృందం అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఒక విధమైన గంభీరతను ఇచ్చింది. 
 
రెండవది, 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న సమయమే 2010-11. ట్యునీషియాలోని జాస్మిన్ ఉద్యమం నుండి న్యూయార్క్, ఆస్ట్రేలియా వరకు జరిగిన ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం వరకు ప్రపంచ వ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఇవి అనేక ప్రభుత్వాలను కదిలించి, ఎందరో నియంతలను కూలదోశాయి. 
 
మూడవది, అన్నా ఉద్యమానికి మీడియా అందించిన భారీ మద్దతు ఒక జాతీయవాద ఉత్సాహాన్ని సృష్టించింది. ఈనాడు, సీజేపీ యూట్యూబర్ల సమూహాన్ని జంతర్ మంతర్ వద్దకు ఆకర్షించారు, కానీ ప్రధాన టీవీ ఛానెళ్లు ఈ మొత్తం సంఘటనను విస్మరించాయి. టీవీ ఛానెళ్లు ఆయన నిరసనను 24/7 ప్రసారం చేయడం వల్లే అన్నా హజారే ఇంటింటా తెలిసిన పేరుగా, ప్రజల ఆరాధ్యుడిగా మారగలిగారు.
 
ఈ విస్తృతమైన ప్రచారమే, స్వతంత్ర భారతదేశంలో మన్మోహన్ సింగ్ అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వానికి అధ్యక్షత వహిస్తున్నారనే కథనాన్ని సృష్టించింది. క్షేత్రస్థాయిలో జరిగిన సీజేపీ కార్యక్రమం, ఈ ఉద్యమానికి ఎలాంటి సన్నాహాలు లేవని, సమీకరణ జరగలేదని, ఇది కేవలం సోషల్ మీడియా ఉత్సాహంపైనే ఆధారపడిందని వాస్తవాన్ని బట్టబయలు చేసింది.
 
నిరసనకు కొన్ని గంటల ముందు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ విమానాశ్రయంలో దిగడం ఆయన అనుభవరాహిత్యాన్ని తెలియజేస్తుంది. లెనిన్, ఖొమేనీల వలె తాను కూడా క్షేత్రస్థాయిలో దిగితే విప్లవం వస్తుందని ఆయన భావించి ఉంటే, అది పొరపాటే.
 
నిజానికి, పోలీసులు విమానాశ్రయానికి వెళ్లి నిరసన తెలిపేందుకు ఆయనకు అనుమతి ఇచ్చారని తెలిసిన వెంటనే, ఈ రోజు ఏమీ జరగదని నాకు నమ్మకం కుదిరింది.  ఏ నిరసననైనా దృఢంగా ప్రతిఘటించే ప్రభుత్వం, సీజేపీ పాలకవర్గానికి ముప్పుగా మారే అవకాశం ఏమాత్రం ఉన్నా ఇంత దయతో వ్యవహరించదు. ఈ కార్యక్రమం జరగదని ప్రభుత్వం నిశ్చయించుకుంది, అందుకే దానిని జరగనిచ్చింది.
 
(ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుండి)