తెలంగాణాలో అడ్డుకోవడంపై రాహుల్, ప్రియాంక స్పందించాలి 

తెలంగాణాలో అడ్డుకోవడంపై రాహుల్, ప్రియాంక స్పందించాలి 
కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాజకీయాలు చేయవచ్చు, కానీ తాము తెలంగాణలో పర్యటిస్తే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏ రకమైన విధానం? అని జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అనిప్రశ్నించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయవచ్చు. గతంలో ఇందిరా గాంధీ గారు కూడా తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారని ఆయన గుర్తు చేశారు. 
 
ప్రాంతీయత పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రాంతీయవాదం తీసుకువస్తే దేశ సుస్థిరత దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని వెల్లడించారు. ఇది భారతదేశం అనుకున్నారా? పాకిస్థాన్‌, పాలస్తీనా అనుకున్నారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కు అయినప్పుడు తమను అడ్డుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్పందించాలని పవన్ కల్యాణ్ కోరారు. 
 
హైదరాబాద్ లో తన సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సమస్యలు, ఇక్కడి యువత ఉపాధి అవకాశాలపై గళం ఎత్తడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. 

“తెలంగాణ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం. ఇక్కడి ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడికి ఉంది. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే నేను భయపడే ప్రసక్తే లేదు. నన్ను ఎంతగా భయపెట్టాలని చూస్తే  నా సంకల్పం అంతకంటే ఎక్కువ బలపడుతుంది” అని పవన్ కల్యాణ్  తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన పలువురు వ్యక్తులు నేడు ఇక్కడ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తమ పర్యటనలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందిస్తూ  గతంలో ప్రజారాజ్యం పార్టీ (యువరాజ్యం) రోజుల నుంచే తెలంగాణ యువత తనకు కొండంత అండగా నిలుస్తున్నారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా తనకు ఇలాంటి ఆంక్షలు, పరిస్థితులు ఎదురయ్యాయని, అయితే ప్రజల మద్దతుతో వాటన్నింటినీ ఎదుర్కొన్నానని తెలిపారు. దేశంలో ఎక్కడైనా తిరిగే, రాజకీయాలు చేసే హక్కు ప్రతి పౌరుడికీ రాజ్యాంగం కల్పించిందని తేల్చి చెప్పారు. 

“మేము ఈ దేశ పౌరులం, చట్టబద్ధంగా పన్నులు చెల్లిస్తున్నాం. తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మాకేం పాస్‌పోర్ట్ అవసరం లేదు” అని పవన్ కల్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యల వంటి అంశాలపై తాము సీరియస్‌గా చర్చిస్తుంటే వాటిని పక్కనబెట్టి కొందరు నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

రాజకీయాల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే తన ఏకైక లక్ష్యమని, భవిష్యత్తులో కూడా తెలంగా తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తాను పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉన్నానని, దీని కోసం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా తానే స్వయంగా ప్రచారకర్తగా తిరుగుతానని స్పష్టం చేశారు.