సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టుకు తల్లితండ్రులు

సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టుకు తల్లితండ్రులు
9వ తరగతి విద్యార్థులకు జులై 1 నుండి త్రిభాషా విద్యా విధానం తప్పనిసరి అమలును సవాలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు శ్రుకవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట తల్లిదండ్రుల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 

వచ్చే ఏడాది 10వ తరగతి బోర్డు పరీక్షలు సమీపిస్తుండగా, 9వ తరగతి విద్యార్థులు అకస్మాత్తుగా కొత్త భాషను నేర్చుకోవడం కష్టతరమని వాదించారు. ఇప్పటికే విద్యాభారం, తోటి విద్యార్థుల ఒత్తిడితో సతమతమవుతున్న విద్యార్థుల్లో ఈ విధానం మరింత త్రీవ ఆందోళనకు దారితీస్తుందని పేర్కొన్నారు.  ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఈ పిటిషన్ ను వచ్చేవారం సంబంధిత బెంచ్ ముందు విచారణకు జాబితా చేస్తామని సిజెఐ తెలిపారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) అనుబంద పాఠశాలల్లో జులై 1 నుండి త్రిభాషా విద్యా విధానం అమలు చేయాలని ఆదేశిస్తూ మే 15న సర్క్యులర్ విడుదల చేసింది.  పాఠశాలలు ఏ భాషనైనా బోధనకు ఎంచుకోవచ్చని, అయితే వాటిలో కనీసం రెండు భాషలు భారతీయ భాషలై ఉండాలని సిబిఎస్ ఇ తెలిపింది.  విదేశీ భాషలను కేవలం మూడవ భాషగా, ఐచ్ఛిక నాలుగవ భాషగా మాత్రమే ఎంచుకోవడానికి వీలుంటుంది.

ఈ నిబంధన జాతీయ విద్యా విధానం (ఎన్ ఇ పి) 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం (ఎన్ సి ఎఫ్- ఎస్ ఇ) 2023లో భాగమని ఆ సర్క్యులర్ తెలిపింది.  10వ తరగతిలో మూడవ భాషకు సంబంధించి ఎటువంటి బోర్డు పరీక్ష ఉండదని సిబిఎస్ ఇ స్పష్టం చేసింది. మూడవ భాష (ఆర్ 3)కి సంబంధించిన అన్ని మూల్యాంకనాలు పూర్తిగా పాఠశాల ఆధారితంగా, అంతర్గతంగానే ఉంటాయి.

ఆర్ 3లో విద్యార్థుల ప్రతిభకు సంబంధించి సిబిఎస్ఇ ధృవపత్రంలో నమోదు చేస్తామని  ఆ సర్క్యులర్‌ పేర్కొంది. త్రిభాషా విధానం కోసం సీబీఎస్‌ఈ మొత్తం 42 భాషల్ని ఎంపిక చేసి, వాటికి సంబంధించిన సిలబస్ రూపొందించింది. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో పొందుపర్చిన భాషలు ఏవైనా నేర్చుకోవచ్చు. పదో తరగతిలో వచ్చే ఏడాది త్రిభాషా విధానం అమలు చేస్తారు. అయితే, దీనికి బోర్డ్ ఎగ్జామ్ మాత్రం నిర్వహించరు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా తుది మార్కుల జాబితాలో కలుపుతారు.