బెంగాల్ హిందువుల కష్టాలు గట్టెక్కినట్లేనా? అరాచకాలు ఆగిపోయేనా?  

బెంగాల్ హిందువుల కష్టాలు గట్టెక్కినట్లేనా? అరాచకాలు ఆగిపోయేనా?  
ఆకారపు కేశవరాజు
జాతీయ సంయుక్త కార్యదర్శి, విశ్వహిందూ పరిషత్ 

గత ఎన్నికల సమయంలో నేను జార్ఖండ్ ఉండగా,  2021 మార్చి 27న ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది విడతల్లో పూర్తి అవ్వగా,  మే 2న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ రాత్రి నుండే హిందువులపై దాడులు మొదలయ్యాయి. మూడో తేదీ ఉదయం నుండి రాత్రి వరకు పురోలియా జిల్లా సరిహద్దు దాటి సుమారు 2000 మంది భయభ్రాంతులైన  సామాన్య హిందువులు, కొందరు ప్రజాప్రతినిధులు ప్రాణ భయంతో కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఝార్ఖండ్ రాష్ట్రం ‘చాన్డీల్’ అనే గ్రామం దాటి రాంచీ పట్టణానికి వచ్చారు.
 
నాలుగో తేదీ పత్రికల్లో అప్పుడే పశ్చిమ బెంగాల్ లో 11మంది హత్య గావించబడ్డారని వార్త చదివాను, వెనువెంటనే,  వచ్చిన ఈ రెండువేల మందికి భోజన సదుపాయాలు కల్పించాలనే సూచన కూడా వచ్చింది. ముఖ్యమైన కార్యకర్తలు వెళ్లి  ఒక విశాలమైన పాఠశాల ఆవరణలో భోజనాలు ఏర్పాట్లు చేశారు. పారిపోయి కుటుంబాలతో సహా ఇల్లు వాకిలి పొలాలు పశువులు అన్నింటిని వదిలి వచ్చిన వీరికి  మరి కొంతమంది కలిశారు.
 
వారి వారి గ్రామాల్లో పరిస్థితులు చక్కబడ్డాయని విశ్వాసం కుదిరిన తర్వాత  వారు కొద్దిరోజులు ఉండి వెళ్ళిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది కనీసం నెల రోజులకు పైగా అక్కడే ఉన్నారు. తిరిగి వెళ్ళిపోవాలంటే ఏమవుతుందోనని భయం. జార్ఖండ్ కి వచ్చినట్టే వేలాది హిందువులు పొరుగున ఉన్న అస్సాం, బీహార్ రాష్ట్రాలలోకి కూడా  వచ్చారు. అక్కడి కార్యకర్తలు, ప్రజలు వారికి కొన్ని వారాలపాటు ఆశ్రయం కల్పించారు.

2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత జరిగిన హింసలో మరణించిన వారి సంఖ్యపై వేర్వేరు నివేదికలు ఉన్నాయి.

1. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) నివేదిక – జూలై 2021 ప్రకారం మొత్తం మరణాలు: 50+ మందికి పైగా ఉండగా పోలీసులు అధికారికంగా 29 హత్యలు అని చెప్పారు. కానీ స్వతంత్రులు లెక్కల్లో 52 అని, 170  హత్యలు అని ఉన్నాయి. అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసం కూడా భారీగా జరిగాయని పేర్కొన్నారు.

2. ‘కాల్ ఫర్ జస్టిస్’ సివిల్ సొసైటీ గ్రూప్ నివేదిక ప్రకారం మాజీ చీఫ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ నేతృత్వంలోని బృందం సమాచారం అందిన మేరకు మొత్తం మరణాలు 25 మంది అని నిర్ధారించింది.  15,000 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులందాయి. (ధైర్యం చేసి ఫిర్యాదు చేసిన వారు కొద్దిమందికాగా, ఫిర్యాదు చేయని వారి సంఖ్య కనీసం మూడింతలు ఉంటుందని సమాచారం). 7,000 మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాయని, 16 జిల్లాలు ప్రభావితం అయ్యాయని తెలిపింది.

3. మీడియా రిపోర్టులు – మే 2021… టైమ్స్ అఫ్ ఇండియా ప్రకారం: మే 4, 2021 నాటికి 11 మంది హత్యకు గురయ్యారు

అధికారిక నివేదికలు మతాల వారీగా విడిగా లెక్కలు ఇవ్వలేదు. అయితే మరణించిన వారిలో ఎక్కువ మంది బిజెపి కార్యకర్తలు, మద్దతుదారులు  హిందువులే ఉన్నారు. ఎన్ హెచ్ ఆర్ సి  నివేదిక “ప్రతిపక్ష మద్దతుదారులను టార్గెట్ చేశారు” అని పేర్కొంది.  ‘కాల్ ఫర్ జస్టిస్’ నివేదిక హింస “ప్రీమెడిటేటెడ్, ఆర్గనైజ్డ్” అని, రాజకీయ ప్రత్యర్థులను నిశ్శబ్దం చేయడానికే అని తెలిపింది. సీబీఐ ఈ హత్య కేసులను విచారిస్తోంది. చాలా కేసులు ఇంకా కోర్టులో ఉన్నాయి.

గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం 

2023 జూన్ 8వ తేదీ జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు అనంతరం 13వ తేదీ కల్లా 57 మంది చనిపోయినట్లు ప్రకటన వెలువడింది. తీవ్రంగా గాయపడిన 400 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. గెలిచిన బిజెపి అభ్యర్థి కూచ్ బీహార్ కు చెందిన బర్మన్ కూడా హత్యకు గురయ్యాడు.  ముర్షిదాబాద్, కూచ్ బెహార్, మాల్దా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో హింస ఎక్కువగా జరిగింది.

ఎన్నికల రోజు హింస (జూలై 8) పోలింగ్ రోజున బ్యాలెట్ బాక్సుల ధ్వంసం, బూత్ ల ఆక్రమణ, బాంబు దాడులు, కాల్పులు జరిగాయి. ఆ ఒక్కరోజే సుమారు 12 నుండి 18 మంది వరకు మరణించారు. ఆటవిక రాజ్యాన్ని తలపింపజేసింది.

ఎప్పటి నుండి బెంగాల్ లో హిందువులే టార్గెట్!

బెంగాల్ మీదికి మొట్టమొదట ఆక్రమణ చేసిన ముస్లిం ముహమ్మద్ బఖ్తియార్ ఖిల్జీ, ఘురిద్ వంశానికి చెందిన టర్కిష్ సైన్యాధిపతి. 1202 లేదా 1204/1205 ఎప్పుడు జరిగిందనే విషయం లోచరిత్రకారుల మధ్య తేదీపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.  కొన్ని ఆధారాల ప్రకారం 10 మే 1205 న నదియా ఆక్రమణ జరిగింది.  ఖిల్జీ కేవలం 18-19 మంది అశ్విక దళంతో రాజధాని నదియా/నబద్వీప్‌పై దాడి చేశాడు

అప్పటి సేన రాజు లక్ష్మణ సేనుడు 80 ఏళ్ల వృద్ధుడు. దాడి సమయంలో తూర్పు బెంగాల్‌కు పారిపోయాడు. ఖిల్జీ లఖ్నౌతిలో తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇది బెంగాల్‌లో ఇస్లామీకరణకు నాంది పలికింది. అయితే ఖిల్జీ మొత్తం బెంగాల్‌ను ఆక్రమించలేకపోయాడు కానీ హిందువులను మతం మార్చడం ద్వారా ఇస్లామీకరణం మొదలుపెట్టాడు.  ఆ తర్వాత కూడా చాలా కాలం హిందూ రాజులు బెంగాల్‌లోని పెద్ద భాగాలను పాలించారు. దీనికి ముందు సాధారణ శకం 712వ సంవత్సరంలోనే,  ఇంకా అంతకుముందే సింధు ప్రాంతంలో ఆక్రమణలు జరిగినప్పటికీ  బెంగాల్‌పై ఇదే మొదటి ముస్లిం ఆక్రమణగా చరిత్రలో నమోదైంది.

ఇంగ్లాండ్ క్రైస్తవుల ఆక్రమణ

బెంగాల్‌ను ఆక్రమించిన మొదటి ఆంగ్లేయ క్రైస్తవులు రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు.  1757 జూన్ 23న జరిగిన ప్లాసీ యుద్ధం ద్వారా వారు బెంగాల్‌పై ఆధిపత్యాన్ని ప్రారంభించారు.  రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను ఓడించి ఈ విజయాన్ని సాధించారు. అనంతరం, 1764లోని బక్సర్ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు బెంగాల్‌పై పూర్తి నియంత్రణను సాధించారు.

ఆంగ్లేయ క్రైస్తవ దోపిడిదారుల కారణంగా చారిత్రక ఆధారాల ప్రకారం, 1770లో కృత్రిమంగా సృష్టించిన బెంగాల్ కరువు (అనేకమార్లు యుద్ధపన్ను పేరుతో విత్తనాలను కూడా లాక్కుని పోయిన కారణంగా సుమారు కోటి మంది మరణించారని చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. అదే కాక ప్రపంచ యుద్ద సమయంలో ఆహార పదార్థాలను వారి దేశాలకు తరలించుకుపోయన కారణంగా భయంకరమైన 1943 నాటి కరువులో 30 లక్షల మంది వరకు చనిపోయారు. 

ఏమైనప్పటికీ ఖిల్జీ దండయాత్ర నుండి ఆంగ్లేయుల దండయాత్ర నుండి ఇప్పటివరకు హిందువుల పైన వివిధ పద్ధతుల ద్వారా అంతులేని అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దేశ విభజన జరిగి, బెంగాల్ విభజనయ్యి బంగ్లాదేశ్ గా మారినా భూభాగంలో 1901లో ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతంలో 33 శాతంగా ఉన్న హిందువుల సంఖ్య 123 ఏళ్లలో 7.95 శాతంకు  పడిపోయింది. కేవలం 1971 సంవత్సరం యుద్ధం తర్వాత 20 లక్షల మంది ఆచూకీ తెలియలేదు.

అత్యాచారాలు ఆగిపోయినట్లేనా?

2026 మే 4వ తేదీ ఎన్నికల ఫలితాలు శ్రీరామభక్తులు సమర్ధించిన పార్టీ విజయకేతనాన్ని ఎగిరేసింది. రామభక్తులు అని ఎందుకు అంటున్నానంటే గత పది సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్లోని ప్రతి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి శోభాయాత్ర నిర్వహించడం, హైందవులలో చైతన్యం రావడం, మరొకవైపు అయోధ్యలో శ్రీరామచంద్రుని గుడి నిర్మించబడడం జరుగుతుంది.

 
మరొక విషయమేమిటంటే బంగాలి భాషలో ఇప్పటికీ అత్యధికంగా రామభక్తులు వ్రాసిన వివిధ “రామాయణాలు” అధికం.  ఆ ప్రభావం ప్రజల నరాల్లో ఉంది. “ఆ శ్రీరామచంద్రుడే తన ఆప్తులైన బజరంగులను పంపించి అక్కడి ప్రజలను రక్షించుకున్నాడు”.

బెంగాల్ ఎన్నికల్లో మోహరించిన పోలీసు/రక్షణ బలగాలు

2026 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం  2.4 లక్షల మంది బలగాలను మోహరింపచేశారు. (2,550 సి ఏ ఆర్ పి కంపెనీలు). 2021 అసెంబ్లీ ఎన్నికల సమయం కంటే రెట్టింపు సంఖ్యలో మోహరింప చేశారు.  2024 లోక్‌సభ ఎన్నికల్లో 900 కంపెనీలు మాత్రమే పాల్గొన్నాయి. ఒకే రాష్ట్రంలో ఎన్నికల కోసం ఇంత పెద్ద మోహరింపు జరపడం ఇదే మొదటిసారి.

2023 పంచాయతీ ఎన్నికల సమయంలో 822 కంపెనీలను మోహరించాలని కోర్టు ఆదేశించినా పోలింగ్ రోజు నాటికి 649 కంపెనీలు మాత్రమే వచ్చాయి. 61,636 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఈ బలగాలను కేవలం 15,000 బూత్‌లలో మాత్రమే మోహరించారు. మిగిలిన చోట్ల బలగాలు లేకపోవడంతో 12-15 మంది చనిపోయారు, మొత్తం 48-57 మంది మరణించారు.

2026లో ఒక్క మరణం కూడా లేకుండా ఎన్నికలు జరిగాయి. .రికార్డు ప్రకారం 2021లో 58 మంది, 2023 పంచాయతీలో 50 మంది చనిపోయారు. అందుకే ఈసారి రికార్డు స్థాయిలో బలగాలను మోహరించారు.

హిందువులను ఎవరు కాపాడాలి?

“ఎన్నికల సమయంలోనే 2,40,000 అక్షరాల రెండు లక్షల నలబై వేల మంది ఉండగా రోజువారీ జీవితంలో రక్షణ ఎవరు కల్పిస్తారు? రక్షక బలగాలు వచ్చే వరకైనా తమను తాము రక్షించుకోగలగాలి. దీనికై  హిందువులు  సంఘటితంగా,  కలిసికట్టుగా ఉండాలి. తమ సంఖ్యను పెంచుకోవాలి. లేకపోతే ఎప్పటి వలెనే అవమానాలు,  అత్యాచారాలు జరుగుతునే ఉంటాయి.” బెంగాల్ హిందూ ప్రజలను చూసి అర్థం చేసుకోవాలి. సంఘటిత శక్తియే మన జాతికి శ్రీరామరక్ష. దేశవ్యాప్తంగా హిందువులు ఐక్యం కావాలి. అన్యాయాలను ఎదుర్కోవాలి.