`కల్పకం’ క్రిటికాలిటీ దశకు చేరడం ఓ ప్రధాన ముందడుగు

`కల్పకం’ క్రిటికాలిటీ దశకు చేరడం ఓ ప్రధాన ముందడుగు
భారత దేశపు మూడు దశల అణు కార్యక్రమం రెండవ దశలో  తమిళనాడులోని కల్పకంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్‌ క్రిటికాలిటీ దశకు చేరడం ఒక ప్రధాన ముందడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 133వ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ, “ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ, దేశం, దేశ ప్రజలు సాధించిన విజయాల పట్ల మనమందరం ఆనందాన్ని పంచుకున్నాము” అని తెలిపారు. 
 
“భారతదేశం ఎల్లప్పుడూ విజ్ఞాన శాస్త్రాన్ని దేశ ప్రగతితో ముడిపడి ఉన్నదిగా చూసింది. ఈ దార్శనికతతోనే మన శాస్త్రవేత్తలు పౌర అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి కృషి వల్ల ఈ కార్యక్రమం గణనీయమైన తోడ్పాటును అందిస్తోంది. ఇది మన పారిశ్రామిక వృద్ధి, ఇంధన, ఆరోగ్య రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. భారతదేశ పౌర అణు కార్యక్రమం రైతుల నుండి ఆధునిక ఆవిష్కర్తల వరకు ప్రతి ఒక్కరికీ అపారమైన సహాయాన్ని అందించింది” అని ప్రశంసించారు. 
 
పవన శక్తి విషయంలో భారత్ మరో మైలురాయిని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో 56 గిగావాట్లకు పైగా పవన శక్తి ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 6 గిగావాట్ల పవన శక్తి అదనంగా ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. పవన శక్తిలో భారత్ నాలుగో స్థానంలో  ఉందని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే సౌర, పవన శక్తి ముఖ్యమని పేర్కొంటూ పునరుత్పాదక విద్యుత్‌తో భవిష్యత్ భద్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 
 
2027 జనాభా లెక్కల కార్యక్రమాన్ని దేశానికి ఒక ముఖ్యమైన ప్రచారంగా అభివర్ణిస్తూ, అందులో ప్రజలు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వారి డేటా సురక్షితంగా ఉంటుందని పౌరులకు హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా, గణన సిబ్బంది మొబైల్ యాప్‌తో ఇంటింటికీ వెళ్లి డేటాను సేకరిస్తారని, ప్రజలు తమకు కచ్చితమైన వివరాలు అందేలా చూసుకోవాలని ఆయన కోరారు. 
 
ప్రజలు తమ సమాచారాన్ని స్వయంగా కూడా నమోదు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. గణన సిబ్బంది తమ నివాసాలకు రావడానికి 15 రోజుల ముందు నుంచే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, వారికి ఈమెయిల్ లేదా మొబైల్‌లో ఒక ప్రత్యేక ఐడీ వస్తుందని, దానిని సిబ్బందికి చూపించి తమ వివరాలను ధృవీకరించుకోవచ్చని ఆయన చెప్పారు. 
 
“జాతీయ జనాభా లెక్కలు కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదు. ఇది మనందరి బాధ్యత. మీ భాగస్వామ్యం చాలా కీలకం. మీరు అందించే సమాచారం పూర్తిగా సురక్షితంగా, గోప్యంగా ఉంచబడుతుంది. 2027 జనాభా లెక్కలను విజయవంతం చేద్దాం,” అని ప్రధాని మోదీ, ఈ కార్యక్రమం డేటా భద్రతపై ఉన్న భయాలను తొలగిస్తూ పేర్కొన్నారు.
 
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో, బుద్ధ భగవానుడి ఆదర్శాలను అనుసరించాలని ప్రధాని మరోసారి ప్రపంచానికి పిలుపునిచ్చారు. ఆయన సందేశాలు వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ అవసరమని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని సృష్టించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. 
 
బుద్ధ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, దక్షిణ అమెరికాలోని చిలీలో ఒక సంస్థ బుద్ధ భగవానుడి బోధనలను ప్రచారం చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆయన బోధనలు ప్రజలు ప్రకృతితో మమేకమై ఉండటానికి సహాయపడతాయని కూడా ఆయన చెప్పారు. 
 
“శాంతి మనలోనే మొదలవుతుందని బుద్ధ భగవానుడు మనకు బోధించారు.  ఆత్మవిజయమే గొప్ప విజయమని ఆయన మనకు తెలియజేశారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉద్రిక్తతలు, సంఘర్షణల మధ్య బుద్ధుని బోధనలు చాలా ముఖ్యమైనవిగా మారాయి,” అని బుద్ధ భగవానుడి బోధనలను అనుసరించాలని ప్రపంచానికి పదేపదే పిలుపునిస్తూ, ఇది యుద్ధాల యుగం కాదని స్పష్టం చేశారు.