పధకం ప్రకారమే గ‌ల్వాన్ లోయ‌లో చైనా క‌వ్వింపులు  

గ‌ల్వాన్ లోయ‌లో క‌వ్వింపులు చైనా ప్ర‌భుత్వ ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రిగాయ‌న‌డానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయ‌ని, భారత జ‌వాన్ల‌పై దాడి కూడా ఇందులో ఒక భాగం కావ‌చ్చ‌ని అమెరికాకు చెందిన అమెరికా – చైనా ఆర్ధిక, భద్రతా సమీక్షా క‌మిష‌న్ (యూఎస్‌సీసీ) తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఈ యూఎస్‌సీసీ 2000వ సంవ‌త్స‌రంలో ఏర్పాటైంది. ఇది అమెరికా, చైనా మ‌ధ్య త‌లెత్తే భ‌ద్ర‌త‌, వాణిజ్య స‌మ‌స్య‌ల‌పై ద‌ర్యాప్తు చేస్తుంది.   
 
గత జూన్‌లో తూర్పు ల‌ఢాక్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో భారత్, చైనాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొనడం, భారత్ లోకి చొర‌బ‌డుతున్న చైనా సైనికుల‌ను అడ్డుకోవ‌డానికి భార‌త జ‌వాన్లు తీవ్రంగా ప్ర‌య‌త్నించడం, ఈ సంద‌ర్భంగా చైనా సైనికులు జ‌రిపిన దాడిలో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రులవడం తెలిసిందే. 
 
అయితే చైనా ప్ర‌భుత్వం ఇలా చేయ‌డానికి కచ్చిత‌మైన కార‌ణం ఏంట‌న్న‌ది తెలియ‌క‌పోయినా.. సరిహ‌ద్దులో ఉన్న బ‌ల‌గాల కోసం భార‌త్ రోడ్డును నిర్మించ‌డం ఒక కార‌ణం కావ‌చ్చ‌ని ఆ క‌మిష‌న్ చెబుతోంది. 
 
ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి కొన్ని వారాల ముందు చైనా ర‌క్ష‌ణ మంత్రి చేసిన దుందుడుకు వ్యాఖ్య‌లు, అక్క‌డి అధికార ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ చేసిన హెచ్చ‌రిక‌లను ఈ క‌మిష‌న్ ప్ర‌స్తావించింది. ఓవైపు భార‌త్‌తో శాంతి చ‌ర్చ‌లు అంటూనే మ‌రోవైపు స‌రిహ‌ద్దులో చైనా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉన్న విష‌యం తెలిసిందే.
 
అమెరికా-చైనా శతృత్వంలో జోక్యం చేసుకుంటే భారత్‌కు గట్టి ఎదురదెబ్బ తప్పదని.. అంతే కాకుండా వాణిజ్య, ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయని గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది.  

దీనికి తోడు గాల్వాన్ లోయలో దాదాపు 1,000 మంది డ్రాగన్ సైనికులు మోహరించిన శాటిలైట్ చిత్రాలు బయటపడ్డ విషయం తెలిసిందే. వీటన్నిటినీ పరిశీలిస్తే ఓ పథకం ప్రకారమే చైనా హింసకు పాల్పడుతోందని అమెరికా-చైనా ఆర్థిక భద్రత సమీక్ష కమిషన్ నివేదించింది.

ఇటు డోక్లాంకు స‌మీపంలో భూటాన్ భూభాగంలో ఇప్ప‌టికే ఒక గ్రామం, రోడ్డు నిర్మించిన చైనా.. ఇప్పుడు రెండో గ్రామాన్ని కూడా నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు బ్ర‌హ్మ‌పుత్ర న‌దిపై డ్యాం నిర్మిస్తోంది. ఇవ‌న్నీ భార‌త్‌ను క‌వ్వించేందుకు చేస్తున్న చ‌ర్య‌లే. 

ఈ ఏడాది కొవిడ్ మ‌హ‌మ్మారితో ప్ర‌పంచ‌మంతా అత‌లాకుత‌లం అవుతున్నా.. చైనా మాత్రం ఇండియాతోపాటు ఇత‌ర దేశాల‌నూ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఈ ఏడాది ఇండియాతోపాటు జ‌పాన్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌, యూకే, కెన‌డాల‌తోనూ చైనా క‌య్యానికి కాలు దువ్వుతోంది.