లెక్కలు చూపని రూ.60 వేల కోట్లు కాంగ్రెస్ నిధులకు తరలింపు?

లెక్కలు చూపని రూ.60 వేల కోట్లు కాంగ్రెస్ నిధులకు తరలింపు?
కాగ్ నివేదిక ప్రకారం, రూ. 3 లక్షల కోట్లకు పైగా ఉన్న తెలంగాణ బడ్జెట్‌లో కేవలం రూ. 2.40 లక్షల కోట్లకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చూపించిందని పేర్కొంటూ సుమారు 20 శాతం, దాదాపు రూ. 60 వేల కోట్లకు ఎలాంటి లెక్కలు చూపించలేదని  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ విస్మయం వ్యక్తం చేశారు.   ఈ డబ్బులు ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్ర, బిహార్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో, ఈ నిధులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం మళ్లించారా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఈ నిధులను ఆయా మంత్రిత్వ శాఖలకు పూర్తిగా పంపించారా? లేక పంపించిన తర్వాత పక్కకు మళ్లించారా? లేక ఆర్థిక శాఖ నుంచే పూర్తిగా విడుదల కాలేదా? లేదా బడ్జెట్ విడుదల కాగానే 20 శాతం ముందుగానే పక్కకు పెట్టారా? అని ఆయన ప్రశ్నించారు.  మొత్తానికి, ఈ డబ్బులు కొందరి జేబుల్లోకి వెళ్లాయా? లేదా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించారా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. 

అందుకు నిదర్శనంగా ఈ బడ్జెట్ అయిపోగానే రేవంత్ రెడ్డి  కేరళం ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రచారం కోసం కేరళకు వెళ్లిన రేవంత్ రెడ్డి పినరయి విజయన్ ని ప్రధాని మోదీ ఏజెంట్ అని, కమ్యూనిస్టులకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనని, కమ్యూనిస్టులు-బిజెపి ది ఫెవికాల్ బంధమని అనడం పూర్తిగా హాస్యాస్పదం అని స్పష్టం చేశారు.

కమ్యూనిస్టు పార్టీలు మతతత్వ శక్తులను ప్రోత్సహిస్తున్నాయంటూ కేరళలో రేవంత్ రెడ్డి ఒక నిజం మాత్రం చెప్పారని చెబుతూ  మతతత్వ సంస్థలైన ఎంఐఎం, ఎస్‌డిపిఐ, పీఎఫ్ఐలను కమ్యూనిస్టులు ఏనాడూ విమర్శించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. వాస్తవానికి పరోక్షంగా ప్రోత్సహించిన సందర్భాలే ఎక్కువగా కనిపిస్తాయని కిషోర్ తేల్చి చెప్పారు.

అయితే కేరళంకు వెళ్లి కమ్యూనిస్టు పార్టీలు మతతత్వ శక్తులను ప్రోత్సహిస్తున్నాయంటూ నిజం మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  మొన్ననే ఖమ్మంలో సీపీఐ శతాబ్ధి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్లి, కమ్యూనిస్టు కార్యకర్తలు లేదా పార్టీలు నిటారుగా నిలబడి మతతత్వ శక్తులపై పోరాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి ఉండదని చెప్పారు. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక, ఆ వైఫల్యాల తర్వాత రాహుల్ గాంధీ ఇక్కడ చేసిన వాగ్దానాలను కేరళంలో పునరావృతం చేయడానికి మొహం చెల్లక రేవంత్ రెడ్డిని పంపించినట్లుగా కనిపిస్తోందని కిషోర్ ఎద్దేవా చేశారు.