డ్రగ్స్ కేసులో ఐఎఎస్‌ అధికారిణి కుమారుడు

డ్రగ్స్ కేసులో ఐఎఎస్‌ అధికారిణి కుమారుడు
తెలంగాణ ఈగల్‌ టీము దాడిలో ఎపికి చెందిన ఐఎఎస్‌ అధికారి కుమారుడు డ్రగ్స్‌ కేసులో చిక్కారు.  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి కొండాపూర్‌లోని క్వాక్ ఎరినా పబ్‌లో గురువారం అర్ధరాత్రి ఈగల్ టీమ్ దాడులు జరిపింది. డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు ఈగల్ టీం, సైబరాబాద్ నార్కోటిక్, గచ్చిబౌలి పోలీసులు కలిసి పబ్బుపై ఆకస్మికంగా డాడి చేయడంతో డ్రగ్స్ తీసుకున్న ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. 
 
పబ్బులో గురువారం బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించగా, ఇందులో 1,500 మంది పాల్గొన్నారు. పబ్బులో ఉన్న 64 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిణి కుమారుడు కూడా ఉన్నారని సమాచారం.  నలుగురికి గంజాయి, బెంజోడియాజెపైన్ ఆనవాళ్లు బయటపడగా ముగ్గురికి గంజాయి, మెథాంఫేటమిన్ పాజిటివ్ వచ్చింది.
మోనిష్ ఉమేష్, పృథ్వీరాజ్, అభిషేక్, రిషబ్, ఆకెళ్ల హరిత్ సారంగ్ (ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి కుమారుడు), రితేష్, జ్యోతిరాధిత్యలకు పాజిటివ్ వచ్చింది.  పాజిటివ్ వచ్చిన వారిని కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. పబ్బులో నిర్వహించిన ఈవెంట్‌కు సినీనటి హేమ హాజరు కాగా, ఈగల్ పోలీసులు ఆమెకు కూడా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. స్పెయిన్‌కు చెందిన ఆర్టిస్టు అలెగ్జాండర్, డీజే ప్లేయర్ కేవీకి నెగిటివ్ వచ్చింది.
 
ఈ మత్తు పదార్థాలు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరి ద్వారా వచ్చాయి? అనే కోణంలో విచారణ జరుగుతోంది. పబ్‌లోనే మత్తు పదార్థాలు తీసుకు న్నారా? లేక బయట తీసుకుని పబ్బులోకి వచ్చారా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉందని ఈగల్‌ టీం అధికారులు తెలిపారు.  డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్నటికీ మత్తు దందా నియంత్రణ కావడంలేదు. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌పై ప్రత్యేక విభాగం ఈగల్‌ టీం దాడులు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్‌ వ్యాప్తి కొనసాగుతోంది. 
 
మరోవంక, ముంబాయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియాకు చెందిన మహిళను ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువైన 7.5 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…నైజీరియా దేశానికి చెందిన జేమ్స్ టెస్లింగ్ యామ్యూనల్ ముంబాయిలో ఉంటోంది. దేశంలోని పలు నగరాలకు కొకైన్ డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ముంబాయిలో గ్రాముకు రూ.15,000 చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి రూ.30వేలకు విక్రయిస్తోంది.