తీవ్ర ఇంధన సంక్షోభంలో పాకిస్థాన్‌

తీవ్ర ఇంధన సంక్షోభంలో పాకిస్థాన్‌

* గ్యాస్‌ సిలిండర్ ధర రూ. 5,135

యుద్ధం కారణంగా దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో అక్కడ లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా 11.67 కిలోల గ్యాస్ సిలిండర్ ధర పాకిస్థాన్‌ రూపాయల్లో ఏకంగా రూ.5,135 స్థాయికి పెరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ధరల పెరుగుదల మరీ ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి.

గ్యాస్ ధరల పెరుగుదల సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఎల్‌పీజీతో నడిచే ఆటోలు, బస్సులు, మినీ బస్సుల రవాణా చార్జీలు పెరగడంతో తక్కువ, మధ్యతరగతి ఆదాయ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు ఈద్, నౌరోజ్ సెలవుల కారణంగా ఇరాన్ నుంచి గ్యాస్ సరఫరా గణనీయంగా తగ్గింది. దాంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. 

పాకిస్థాన్‌లో ఇంధన నిల్వలు కూడా ప్రమాదకర స్థాయిలో అడుగంటిపోయాయి. దేశంలో కేవలం 11 రోజులకు సరిపోయేంత మాత్రమే ముడి చమురు ఉంది. అదేవిధంగా 27 రోజులకు సరిపోయే పెట్రోల్, 21 రోజులకు సరిపోయే డీజిల్, 9 రోజులకు సరిపోయే ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ పెట్రోలియం శాఖ కార్యదర్శి సెనేట్ కమిటీకి తెలిపారు.  పాకిస్థాన్ తన పెట్రోలియం అవసరాల్లో దాదాపు 70 శాతం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటున్నది.

ప్రస్తుత సంక్షోభంవల్ల సరఫరా మార్గాలు దెబ్బతిన్నాయి. సరఫరాలో అంతరాయాల కారణంగా ఏప్రిల్ 14 తర్వాత దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా మార్చి నెలలో రావాల్సిన 8 ఎల్ఎన్‌జీ కార్గోలలో కేవలం రెండు మాత్రమే పాకిస్థాన్‌కు చేరాయి. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అనుమతి కోసం ఇరాన్‌తో పాకిస్థాన్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చర్చలు సఫలమైతే అక్కడి ప్రజలకు ఇంధన సంక్షోభం నుంచి కాస్త ఉపశమనం లభించనుంది.