విశాఖ తీరానికి ఎల్‌పీజీ, చమురు నౌకలు

విశాఖ తీరానికి ఎల్‌పీజీ, చమురు నౌకలు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్, ఇంధన నిల్వలపై ప్రజలలో ఆందోళనలు నెలకొన్న సమయంలో  విశాఖ తీరానికి ఎల్‌పీజీ, చమురు నౌకలు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి.  విశాఖ తీరానికి గ్యాస్, ఆయిల్ లతో కూడిన భారీ నౌకలు బిర్చ్ ఎల్పిజి నౌక, లూపినస్ ఎల్పిజి నౌక, ఎంటీ పెట్రాయిట్ క్రూడాయిల్ నౌక గురువారం చేరుకున్నాయి. 
 
24 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్‌పీజీ గ్యాస్‌తో ‘బీడబ్ల్యూ బ్రిచ్‌’అనే భారీ నౌక గురువారం తీరానికి చేరింది.  ఎంటీ పెట్రాయిట్ నౌకలో పెద్ద మొత్తంలో క్రూడాయిల్ నిల్వలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే ఫిబ్రవరి 26న ఎల్పిజి గ్యాస్ 22 టిఎంటితో ఖతార్ పోర్టు నుంచి బయల్దేరిన లూపినస్ నౌక కూడా గురువారం విశాఖ పోర్టుకు చేరుకుంది. యుఎఇ నుంచి ఈ నెల 12న 26 టిఎంటిల ఎల్పిజి గ్యాస్ మరో నౌక బయలుదేరింది. 
 
దేశ్ విశాల్ నౌక ఇరాక్ లోని బస్రా పోర్టు నుంచి ఈ నెల 10న బయలుదేరింది. ఇవి కూడా త్వరలో భారత్ కు రానున్నట్టు అధికారులు చెబుతున్నారు. రష్యా నుంచి ఈ నెల 25న బయలుదేరిన సెంచూరియన్ ఎల్పిజి నౌక 100 టిఎంటి లోడ్తో విశాఖ పోర్టుకు చేరుకోనుంది. 1,36,728 మెట్రిక్ టన్నులతో కూడిన ఎల్పిజి నౌక జుంబో ఈ నెల 27 సాయంత్రానికి విశాఖకు చేరుకోనుంది. 
 
నెదర్లాండ్స్‌లో లోడింగ్‌ చేసుకున్న హెల్లాస్‌ గ్లాడియేటర్, అమెరికా పోర్టులో లోడింగ్‌ చేసుకున్న జుపిటర్‌ నౌకలు ఈ నెల 30న విశాఖకు రానున్నాయి. ఇప్పటికే లుపినస్‌ , ఏఐ వుకిర్‌ నౌకలు యూఏఈ, ఖతార్‌ నుంచి గత నెల 26, ఈ నెల 3న విశాఖ చేరుకున్నాయి.  వచ్చే నెల 2, 5 తేదీల్లో రష్యా నుంచి ఫౌండేయ , దేశ్‌ గౌరవ్‌ నౌకలు ముడి చమురుతో రానున్నాయి.
 
హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు సంబంధించి ఎంవీ సమర్‌ శృతి నౌక పోర్టులో యాంకరేజీలో లంగర్‌ వేసి ఉంచారు. 65 వేల టన్నుల హైస్పీడ్‌ డీజిల్‌ను అన్‌లోడ్‌ చేస్తున్నారు.  అలాగే ఏప్రిల్ 5న దేశ్ గౌరవ్ నౌక 99,898 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ లోడ్ తో ముందా పోర్టు నుంచి విశాఖకు రాబోతుంది.  ఈ నెల 1 నుంచి 25 వరకు ఇరాక్, రష్యా, ఖతార్, యూఏఈ, భారత దేశంలోని పలు పోర్టుల నుంచి పది చమురు నౌకలు, రెండు ఎల్‌పీజీ నౌకలు విశాఖకు చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.