లోక్‌స‌భ‌లో 8 మంది విప‌క్ష ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌

లోక్‌స‌భ‌లో 8 మంది విప‌క్ష ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌

లోక్‌స‌భ‌లో 8 మంది విప‌క్ష ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేశారు. కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు స‌భ‌లో ఆర్టిక‌ల్ 370 కింద తీర్మానం ఆమోదింపచేశారు. మూజువాణి ఓటు ద్వారా ఎంపీల‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను ఎత్తేశారు. తొలుత మంగళవారం కాంగ్రెస్ చీఫ్ విప్ కే సురేశ్‌ ఎంపీల‌పై నిషేధాన్ని ఎత్తివేయాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమాజ్‌ వాది పార్టీకి చెందిన ధర్మేంద్రయాదవ్‌, ఎన్‌సిపి(ఎస్‌పి)కి చెందిన సుప్రియా సూలే మద్దతు తెలిపారు. 

స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన ఫ్లోర్‌ లీడర్ల సమావేశంలో ఈ అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని జాతీయ మీడియా సోమవారం తెలిపింది. అనుచిత ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు సురేశ్ పేర్కొన్నారు. ట్రెజ‌రీ బెంచ్‌లు కూడా హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని ధ‌ర్మేంద్ర యాద‌వ్ కోరారు.

స‌భా వ్య‌వ‌హారాల‌ను సవ్యంగా న‌డిపేందుకు ల‌క్ష్మ‌ణ రేఖ గీయాల్సి వ‌స్తుంద‌ని మంత్రి రిజిజు తెలిపారు. స‌భా వ్య‌వ‌హారాలు స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని, విప‌క్షాల‌కు కూడా స‌మాన అవ‌కాశం ఇవ్వాల‌న్ని సురేశ్ కోరారు.  అయితే ఆ స‌మ‌యంలో స్పీక‌ర్ ఓం బిర్లా మాట్లాడుతూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించ‌రాదు అని, ఏఐ జ‌న‌రేటెడ్ పిక్‌ల‌ను వాడ‌వ‌ద్దు అని స‌భ్యుల‌ను బిర్లా కోరారు. ఆ త‌ర్వాత ర‌ద్దు తీర్మానాన్ని ఆమోదింపచేశారు. 

ఫిబ్రవరి 3న, బడ్జెట్‌ సమావేశాల మొదటి సెషన్‌లో దురుసుగా ప్రవర్తించారంటూ సిపిఐ(యం) ఎంపితో పాటు ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపిలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండైన వారిలో కాంగ్రెస్‌కు చెందిన గుర్జీత్‌ సింగ్‌ ఔజ్లా, హిబి ఈడెన్‌, సి.కిరణ్‌కుమార్‌ రెడ్డి, అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌, మాణిక్యం టాగోర్‌, ప్రశాంత్‌ పడోలె, డీన్‌ కురియా కోస్‌లతో పాటు సిపిఐ(యం) ఎంపి ఎస్‌.వెంకటేశన్‌లు ఉన్నారు. స‌స్పెన్ష‌న్ ఎత్తివేసిన త‌ర్వాత ఆ 8 మంది ఎంపీలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న గాంధీ విగ్ర‌హం వ‌ద్ద‌కు వెళ్లి నివాళి అర్పించారు.