ఏపీ హైకోర్టుకు తొలిసారి ప్రధాన న్యాయమూర్తిగా మహిళ

ఏపీ హైకోర్టుకు తొలిసారి ప్రధాన న్యాయమూర్తిగా మహిళ
* పదవీ విరమణకు 2 నెలల ముందే కొత్త సీజేల నియామకం
 
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఎపి హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్ – హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడటమే తరువాయి, ఆమె అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు. 

ఆమెను ముందుగా ఆంధ్రప్రదేశ్​ హైకోర్టుకు బదిలీ చేసి, ఖాళీ ఏర్పడిన రోజునుంచే చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ ముందస్తు బదిలీ ద్వారా ఆమె కోర్టు పరిపాలన, కేసుల నిర్వహణ, రోస్టర్ వ్యవస్థ వంటి అంశాలను సమగ్రంగా తెలుసుకునే వీలుంటుందని కొలీజియం పేర్కొంది.  సాధారణంగా ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత కొత్తవారి నియామకం జరిగేది.

కానీ, ఈసారి సుప్రీంకోర్టు కొలీజియం ప్రస్తుత సీజేలు రిటైర్ కావడానికి రెండు నెలల ముందే వారి వారసుల పేర్లను కేంద్రానికి పంపిస్తుంది.  దీంతో కొత్త సీజేలు కోర్టు పరిపాలన, వ్యవస్థపై ముందుగానే అవగాహన పొందే అవకాశం ఉంటుందని కొలీజియం భావిస్తోంది. మరోవైపు, మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ ధర్మాధికారి ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.

కొలీజియం తెలిపిన ప్రకారం, హైకోర్టుల పరిపాలనలో చీఫ్ జస్టిస్ పాత్ర ఎంతో కీలకం. కేసుల కేటాయింపు, న్యాయమూర్తుల రోస్టర్ నిర్ణయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెండింగ్ కేసుల నిర్వహణ, మొత్తం పరిపాలనా పర్యవేక్షణ వంటి అనేక బాధ్యతలు సీజేలపై ఉంటాయి.  కొత్తగా వచ్చినవారు ఒక్కసారిగా బాధ్యతలు చేపట్టడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే బదిలీ చేసి అనుభవం కల్పించడం ద్వారా మొదటి రోజే సమర్థంగా పనిచేయగలరని కొలీజియం భావిస్తోంది.