వైఫల్యాలు దాచిపెట్టేందుకే రేవంత్ `రైసింగ్ తెలంగాణ’ సదస్సు

వైఫల్యాలు దాచిపెట్టేందుకే రేవంత్ `రైసింగ్ తెలంగాణ’ సదస్సు
రెండు సంవత్సరాల పాలనలో తెలంగాణను దివాళా పరిస్థితికి నెట్టేసి, రూ. 2 లక్షల కోట్లకు పైగా కొత్త అప్పులు మోపిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తమ పాలనా వైఫల్యాలను దాచిపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ “రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” అనే పేరుతో కొత్త నాటకం ఆడుతోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్. వి. సుబాష్ విమర్శించారు.
 
ఈ సమ్మిట్ మొత్తం కేవలం ప్రచార ఆర్భాటాలు మాత్రమేనని, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక దుర్వినియోగం, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఖరీదైన ప్రచార కార్యక్రమం తప్ప మరేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. అసలు తెలంగాణ రైజింగ్ కాదని- రైజింగ్ డెబ్ట్స్, రైజింగ్ ఇన్‌ఫ్లేషన్, రైజింగ్ పవర్ టారిఫ్స్, రైజింగ్ లైస్ మాత్రమే పెరుగుతున్నాయని సుభాష్ దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వంలో నిజంగా ‘రైస్’ అవుతున్న విషయం ఏదైనా ఉంటే, అది అప్పు తీసుకునే దురాశ, ప్రచారం కోసం ఖర్చు చేసే పిచ్చి మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు.

రైజింగ్ తెలంగాణ సమ్మిట్ అనేది రైజింగ్ ఏమీ కాదు-పూర్తిగా పొగమంచు, నాటకమే అని పేర్కొంటూ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం, విశ్రాంత ఉద్యోగులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కూడా క్లియర్ చేయలేని పరిస్థితి. ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒక్కటీ నెరవేర్చకుండా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం ప్రజా ధనాన్ని బహిరంగంగా దుర్వినియోగం చేయడమేనని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో బిజెపి వ్యతిరేకం కాదని, కాని గ్లోబల్ ఇన్వెస్టర్లు నాయకత్వం, స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ ఉన్న రాష్ట్రాల వైపే చూస్తారని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇక్కడ భూములను అమ్మకం పెట్టి, అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని నెలలకొకసారి పాలసీలు మార్చేస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ‘రైజింగ్ తెలంగాణ సమ్మిట్’ పెట్టుబడులను రప్పించే కార్యక్రమం కాదు, ఈ ప్రభుత్వంలోని అస్థిరత, ఆర్థిక గందరగోళాన్ని మాత్రమే మరోసారి బహిర్గతం చేసే ఈవెంట్‌ అని సుభాష్ స్పష్టం చేశారు.

“దశాబ్దం పాటు తెలంగాణ దేశంలో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్‌లో ఒకటిగా నిలిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేండ్లలోనే ఈ రాష్ట్రాన్ని పెట్టుబడుల కోసం వేడుకునే పరిస్థితికి నెట్టేసింది” అని  సుభాష్ తీవ్రంగా విమర్శించారు.