వైట్‌హౌస్‌కు సమీపంలో కాల్పులు.. ఉగ్రదాడి!

వైట్‌హౌస్‌కు సమీపంలో కాల్పులు.. ఉగ్రదాడి!
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘హేయమైన చర్య’, ‘ఉగ్రవాద దాడి’గా అభివర్ణించారు. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తక్షణమే వాషింగ్టన్‌కు అదనంగా 500 మంది సైనికులను పంపాలని పెంటగాన్‌ను ఆదేశించారు.

బుధవారం మధ్యాహ్నం వైట్‌హౌస్‌కు కొన్ని బ్లాకుల దూరంలోనే ఈ దాడి జరిగింది. వెస్ట్ వర్జీనియాకు చెందిన నేషనల్ గార్డ్ సైనికులు గస్తీ కాస్తుండగా, ఓ దుండగుడు అకస్మాత్తుగా వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో భద్రతా దళాలు వెంటనే వైట్‌హౌస్ కాంప్లెక్స్‌ను లాక్‌డౌన్ చేశాయి. కాల్పుల సమయంలో ట్రంప్ ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో క్లబ్‌లో ఉన్నారు.

దాడి చేసిన వ్యక్తి శ్వేత సౌధానికి సమీపంలోని మూల మలుపు తిరగగానే గార్డ్స్​పై కాల్పులు జరపడం ప్రారంభించాడని పోలీస్ చీఫ్ జెఫ్రీ కారోల్ వెల్లడించారు. కాల్పులు జరిగిన వెంటనే సమీపంలో ఉన్న ఇతర నేషనల్ గార్డ్ సభ్యులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కాల్పులు జరిగిన ప్రదేశంలోకి పరుగెత్తుకు వచ్చి, కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుడిని పట్టుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని 29 ఏళ్ల రెహమానుల్లా లకన్‌వాల్‌గా గుర్తించారు. ఇతడు 2021లో తాలిబన్లు అధికారం చేపట్టాక ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అమెరికా సైన్యానికి సహాయం చేసిన అఫ్ఘన్లకు ఇచ్చే ప్రత్యేక వీసాపై వచ్చిన ఇతడు, వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. గత బైడెన్ ప్రభుత్వమే నిందితుడిని దేశంలోకి అనుమతించిందని ఆరోపించారు. నరకంలాంటి అఫ్ఘనిస్థాన్ నుంచి అతడిని తీసుకొచ్చారని విమర్శించారు. బైడెన్ హయాంలో ఆఫ్ఘన్ నుంచి వచ్చిన శరణార్థులందరి వివరాలను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడికి పాల్పడింది అఫ్గాన్ జాతీయుడు కాగా.. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు (యుఎస్ సిఐఎస్) అఫ్గాన్ జాతీయులకు సంబంధించిన అన్ని ఇమ్మిగ్రేషన్ అభ్యర్థనలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. “భద్రత, పరిశీలన ప్రోటోకాల్‌లపై తదుపరి సమీక్ష పూర్తయ్యే వరకు అఫ్గాన్ జాతీయులకు సంబంధించిన అన్ని ఇమ్మిగ్రేషన్ అభ్యర్థనల ప్రాసెసింగ్‌ను తక్షణమే, నిరవధికంగా నిలిపివేస్తున్నాం” అని యూఎస్‌సీఐఎస్ ఎక్స్ వేదికగా తెలిపింది. 

 
దేశ భద్రత, అమెరికన్ ప్రజల రక్షణే తమ ఏకైక లక్ష్యం అని స్పష్టం చేసింది. 2021లో తాలిబన్ స్వాధీనం తర్వాత అమెరికాకు వచ్చిన అఫ్గాన్ వలసదారులపై పర్యవేక్షణ పెంచుతామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం గమనార్హం.