
పాశ్చాత్య దేశాలలోని కొన్ని పెడ ధోరణులు మన విద్యాలయాలలో ప్రవేశిస్తున్నాయని ప్రభుత్వ పూర్వ ముఖ్య కార్యదర్శి, విద్యా భారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక విధానాలతో విఫలమైన సిద్ధాంతాలు ఇప్పుడు దారి మార్చుకుని విద్యావ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ఇటువంటి అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పారు.
ఒంగోలులో జరిగిన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం, అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధి సభలో మాట్లాడుతూ భారతీయత, నిఖార్సైన విలువలను విద్యా వ్యవస్థ ద్వారా తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. సమాజంలో సకారాత్మక అంశములను అన్ని స్థాయిలకు తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. విద్యా భారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజం ఆపేక్షిస్తున్న అంశాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇటువంటి ఉన్నత స్థాయి సమావేశాల్లో చర్చించిన విద్యాత్మిక విషయాలను అట్టడుగు స్థాయికి తీసుకుని వెళ్లడం ముఖ్యం అని ఆయన తెలిపారు. వివిధ జిల్లాలలోని గ్రామాల స్థాయికి, పట్టణం నగరాలలోని బస్తీల స్థాయికి భారతీయ విలువలను ప్రభావితం చేసే స్థాయిలో తీసుకెళ్లి పనిచేయాలని సుధాకర్ రెడ్డి సూచించారు. సమాజాన్ని తప్పుదారి పట్టించే కథనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
విద్యా భారతి క్షేత్ర కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు నివేదికను సమర్పించారు. అఖిల భారతీయ కార్య కారిణీ సభ్యులు కాశీపతి మార్గదర్శనం చేశారు. క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. దేశవ్యాప్తంగా 24 వేలకు పైగా విద్యాలయాలను విద్యా భారతి సామాజిక సేవ కోణంలో నిర్వహిస్తున్నది. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యా భారతికి అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 400 పైగా విద్యాలయాలు నడుస్తున్నాయి.
గిరిజన, సాగర తీర గ్రామాలలో వేల సంఖ్యలో ఏకల్ విద్యాలయాలు స్వచ్ఛంద సేవను అందిస్తున్నాయి. ప్రముఖ విద్యావేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా భారతికి ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు, తెలంగాణ విద్యా భారతి కి ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు, కర్ణాటక విద్యాభారతికి కర్ణాటక యూనివర్సిటీ మాజీ వీసీ పరమేశ్వర హెగ్డే అధ్యక్షత వహిస్తున్నారు.
విద్య ద్వారా భవిష్యత్తు తరాలని, భారతీయత దిశగా నడిపించవచ్చు అనేది విద్యా భారతి అభిప్రాయం. మూడు రాష్ట్రాల నుంచి 100కు పైగా విద్యావేత్తలు, నిపుణులు, పాలకమండలి సభ్యులు హాజరయ్యారు. విలువలతో కూడిన విద్యను అన్ని స్థాయిల్లో అందించే అంశం మీద దఫదపాలుగా చర్చలు జరిపారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు