దానం నాగేందర్‌ అనర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు చెంపపెట్టు.. బిజెపి

దానం నాగేందర్‌ అనర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు చెంపపెట్టు.. బిజెపి
ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టు లాంటి సమాధానం అని బిజెపి నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడం పట్ల హర్షం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తమ రాజకీయ విధానాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టాలు చూస్తూ ఊరుకోవని మరోసారి నిరూపితమైందని పేర్కొంటూ రేపు ప్రజాకోర్టులోనూ ఈ రెండు పార్టీలు ఏం సమాధానం చెబుతాయి? అని ఆయన ప్రశ్నించారు.

గతంలో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారని, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కేసీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారని అయన గుర్తు చేశారు.  అదే విధంగా టీడీపీ నుంచి గెలిచిన  తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారని చెబుతూ అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారైందని ఎద్దేవా చేశారు.

 
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లారని పేర్కొంటూ ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు పార్టీలు మారాలనుకున్నప్పుడు గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీతో రాజకీయంగా నడవడం ప్రజాతీర్పును కాలరాయడమే అవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఈనాడు దానం నాగేందర్ విషయంలో వచ్చిన హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలముందు దోషులుగా నిలబడ్డాయని చెప్పారు. 

దానం నాగేందర్‌ అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వాగతించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం బీజేపీ అనేక రోజులుగా పోరాటం చేస్తోందని చెబుతూ ఒక పార్టీ తరఫున గెలిచి, అనంతరం మరో పార్టీ తరఫున కొనసాగుతున్న దానం నాగేందర్‌ వ్యవహారంపై బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని తెలిపారు. 
 
స్పీకర్‌ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమైన పరిణామమని, ఈ తీర్పు ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఆయన పేర్కొన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని, ఇతర పార్టీల నుంచి తమ వైపు వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు. 

బీజేపీ న్యాయం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిందని, బీజేపీఎల్పీ నేతగా తాను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని తెలిపారు. సంబంధిత ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
 
దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు స్వాగతించారు. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడమే కాకుండా, ఒక పార్టీపై గెలిచి మరో పార్టీ తరఫున నామినేషన్ వేసిన నాటి నుంచే ఆ అనర్హత వర్తిస్తుందని పేర్కొనడం, స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టడం అత్యంత కీలక పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం నైతికంగా, చట్టపరంగా రాజ్యాంగానికి లభించిన తిరుగులేని గెలుపని కొనియాడారు.

ప్రజాస్వామ్య వ్యవస్థపై నిజమైన గౌరవం ఉంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. వారు ఏ పార్టీలో చేరారో అదే పార్టీ గుర్తుపై మళ్లీ పోటీ చేసి, ప్రజాక్షేత్రంలో ప్రజాతీర్పును పొంది గెలవడమే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి అని తేల్చిచెప్పారు.
 
 ప్రజలు ఒక ఆలోచనతో, ఒక పార్టీ గుర్తుపై గెలిపిస్తే  ఆ నమ్మకాన్ని తుంగలో తొక్కి అధికార దాహంతో కాంగ్రెస్ పంచన చేరడమే కాకుండా, సిగ్గులేకుండా ఆ పార్టీ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసిన నాగేందర్‌కు ఈ తీర్పు చెంపపెట్టు అని బిజెపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రజాస్వామ్య విలువలను స్వార్థ రాజకీయాల కోసం తాకట్టు పెట్టిన ఏ నాయకుడికైనా ఇలాంటి పరాభవమే ఎదురవుతుందని హైకోర్టు నిరూపించిందని తెలిపారు.