కిషౌ నీటి ప్రాజెక్టు ఒప్పందంపై ఆరుగురు ముఖ్యమంత్రుల సంతకాలు

కిషౌ నీటి ప్రాజెక్టు ఒప్పందంపై ఆరుగురు ముఖ్యమంత్రుల సంతకాలు
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని ‘టోన్స్’ నదిపై 232.6 మీటర్ల ఎత్తు గల కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి, ఉత్తర భారతదేశానికి చెందిన ఆరుగురు ముఖ్యమంత్రులు మంగళవారం నాడు ‘కిషౌ ప్రాజెక్ట్’ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ డ్యామ్ 1,562 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండి, 97,000 హెక్టార్ల భూమికి సాగునీటిని అందిస్తుంది. 
 
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో ముఖ్యమంత్రులు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.  సంతకాలు చేసిన ఆరుగురు ముఖ్యమంత్రులు: యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), పుష్కర్ సింగ్ ధామి (ఉత్తరాఖండ్), సుఖ్విందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), రేఖా గుప్తా (ఢిల్లీ) మరియు నయాబ్ సింగ్ సైనీ (హర్యానా).
 
నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల మధ్య ఉన్న పదవ నీటి వివాదానికి ఈ ఒప్పందం ముగింపు పలికింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,476 మిలియన్ యూనిట్ల స్వచ్ఛమైన జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే నీటిలో 25 శాతం యమునా నదికి మళ్లించడం ద్వారా నది పునరుజ్జీవం పొంది స్వచ్ఛంగా మారుతుంది. కాబట్టి ఢిల్లీతో పాటు యమునా నది కూడా దీనివల్ల అత్యధిక ప్రయోజనం పొందుతుంది. 
 
భారత ప్రభుత్వం కిషౌ ప్రాజెక్ట్‌ను ‘జాతీయ ప్రాజెక్ట్’గా ప్రకటించింది. దీని ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం దాదాపు 90 శాతం భరిస్తుంది, మిగిలిన 10 శాతాన్ని 1994 నాటి ఒప్పందం ప్రకారం ఇందులో భాగస్వాములైన రాష్ట్రాలు భరిస్తాయి. ఒప్పందంపై సంతకాలు చేసిన ఆరు రాష్ట్ర ప్రభుత్వాలలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని హోం మంత్రి పేర్కొన్నారు.
 
“భారత ప్రభుత్వం తరపున, వారి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని వారికి హామీ ఇచ్చాము. అలాగే, భవిష్యత్తులో రాష్ట్రంపై పడే ఆర్థిక భారాన్ని భరించడంలో కూడా ఉత్తరాఖండ్‌కు సహాయం చేస్తాము,” అని అమిత్ షా తెలిపారు. ఢిల్లీకిఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, యమునా నదీ జలాల కేటాయింపు సమయంలో విధాన నిర్ణేతల వైపు నుండి తీవ్రమైన లోపం జరిగిందని హోం మంత్రి చెప్పారు.
 
యమునా నదికి ఉండాల్సిన కనీస పర్యావరణ ప్రవాహాన్ని అస్సలు పరిగణనలోకి తీసుకోకుండా, అందుబాటులో ఉన్న నీటినంతటినీ రాష్ట్రాల మధ్య పంపిణీ చేశారు. దీనివల్ల నదికి ఏమాత్రం నీరు మిగలలేదు. ఇప్పుడు, కిషౌ ప్రాజెక్ట్ ఒప్పందం ద్వారా 25 శాతం నీరు అందుబాటులోకి రానుంది. ఇది ఢిల్లీ, యమునా నది రెండింటికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటూ, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. 2029 నాటికి స్వచ్ఛమైన యమునా లక్ష్యాన్ని సాధిస్తామని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
 
 “యమునా నది స్వచ్ఛంగా మారినప్పుడు గంగా నది కూడా స్వచ్ఛంగా మారుతుంది, ఎందుకంటే చివరికి యమునా నది ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా నదితో కలుస్తుంది,” అని ఆయన పేర్కొన్నారు. నదీ పరీవాహక ప్రాంతంలో చేపట్టే ప్రతి నిల్వ ప్రాజెక్టుకు ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవాలని 1994 మే 12న కుదిరిన ముందస్తు ఒప్పందం కారణంగానే కిషౌ ఒప్పందం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. “ఆ ఏర్పాటు లేకపోతే, ఇది సాధ్యమయ్యేది కాదు,” అని ఆయన పేర్కొన్నారు.
 
లఖ్వార్, రేణుకాజీ ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు 2019లో పరిష్కారమైన తర్వాత, కిషౌ ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగాయి. ఈ ప్రాజెక్టుపై అధికారిక ఒప్పందం ఈ ఏడాది జూన్ 16న కుదిరింది. జల శక్తి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లింది. అన్ని రాష్ట్రాల సమ్మతిని పొందడంతో పాటు, సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసింది. 
 
ఇది యమునా నదిని శుభ్రపరచడంలోనూ, అలాగే కోట్లాది మంది ప్రజలకు తాగునీరు, వ్యవసాయం, అభివృద్ధి, పారిశ్రామిక అవసరాల కోసం నీటిని అందించడంలోనూ సహాయపడుతుంది.