1,000 రోజుల్లో రేవంత్ రెడ్డి 1,000 అబద్ధాలు

1,000 రోజుల్లో రేవంత్ రెడ్డి 1,000 అబద్ధాలు
ఎన్  రామచందర్ రావు 
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయిందని చెప్పుకుంటూ, దాన్ని “1,000 రోజుల ప్రజా పాలన” పేరుతో ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో తెలంగాణ పరిస్థితులను గమనిస్తే, ఈ 1,000 రోజుల పాలన ప్రజలకు ఏమి ఇచ్చిందో పరిశీలిస్తే నేడు తెలంగాణ అత్యంత ఆందోళనకరమైన, దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతున్నాను: అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు, గ్యారెంటీలలో ఇప్పటివరకు అమలైనవి ఎన్ని? నెరవేర్చిన హామీలు ఏవి?

రైతులకు తీరని అన్యాయం

* అధికారంలోకి రాకముందు రైతులకు అనేక భారీ హామీలు ఇచ్చారు. రుణమాఫీ పూర్తి చేయడానికి సుమారు రూ. 40,000 కోట్లు అవసరం కాగా, కేవలం రూ. 18,000 కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు.
* ‘రైతు భరోసా’ కింద ఎకరానికి రూ. 15,000 ఇస్తామని చెప్పి, గద్దెనెక్కాక దాన్ని రూ. 12,000 కు తగ్గించారు. ఆ మొత్తాన్ని కూడా సకాలంలో, పూర్తిగా ఇవ్వడం లేదు; ఇంకా భారీగా బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
* కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు కౌలు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు, కష్టాల్లో ఎక్కువ శాతం కౌలు రైతులవే ఉంటున్నాయి.
* ధాన్యానికి ఇస్తామన్న రూ. 500 బోనస్ హామీ అమలు కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.

నిరుద్యోగ యువతకు ద్రోహం

* ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే యువతకు, విద్యార్థులకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
* కానీ ప్రభుత్వం స్వయంగా విడుదల చేసిన లెక్కల ప్రకారమే ఇప్పటివరకు కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. 100 రోజుల్లో లక్షలాది మందికి ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైంది?

మహిళా సంక్షేమ హామీల గతి ఏది? 

* యువతులకు స్కూటర్లు, మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం, పెళ్లిళ్లకు బంగారం ఇస్తామని ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికారు.
* అవి ఏవో సాధారణ ప్రకటనలు కావు, ప్రజలకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు. ఆ హామీలు ఏమయ్యాయో, అందులో ఎన్నెన్ని నెరవేర్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఉద్యోగులు, పెన్షనర్ల వేదన

* విద్యార్థులు, రైతుల కోసం ఎంతో చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం.. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్లు, ప్రయోజనాల కోసం వారిని రోడ్లపై ఎందుకు నిలబెడుతోంది? పెన్షన్ డబ్బులు రాక ఎన్నో కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
* ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదు. వారి ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు ఎలా గడవాలి? జీతాలు అడిగితే ‘ఖజానాలో నిధులు లేవు’ అని చెప్పడమేనా మీ 1,000 రోజుల ప్రజా పాలన?
* ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలు ఏమైంది?

డిక్లరేషన్ల పేరుతో మోసం

* బీసీ సంక్షేమం అన్నారు, ఎస్సీ డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు.. సమాజంలోని అన్ని వర్గాలకు కొండంత ఆశలు చూపించారు. ఆ డిక్లరేషన్లు, కమిట్‌మెంట్లు ఇప్పుడు ఎక్కడికి పోయాయి?
* ఈ 1,000 రోజుల్లో ప్రజలకు మీరు చెప్పింది 1,000 అబద్ధాలు మాత్రమే. ఇది ‘ప్రజా పాలన’ కాదు, ముమ్మాటికీ *’ప్రజా వంచన పాలన’*.

హైదరాబాద్ ప్రజలపై కొత్త భారాలు & ఆందోళనలు 

* హైదరాబాద్ ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి ముందుగా హైడ్రా  తీసుకొచ్చారు.
* పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడులపై అనిశ్చితి సృష్టిస్తూ హిల్ట్ తెచ్చారు.
* ఇప్పుడు నగర పౌరులపై కొత్త పన్నులు, రుసుముల భారం మోపేందుకు *క్యూర్ తీసుకువస్తున్నారు.
* ప్రజలను భయపెట్టడానికి హైడ్రా, అస్థిరపరచడానికి హిల్ట్, వసూలు చేసుకోవడానికి క్యూర్ — ఇదేనా మీ పాలనా విధానం?
* హైదరాబాద్ పరిసరాల్లో ఎకరం భూమి రూ. 250 కోట్లు పలుకుతోందని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎకరం రూ. 250 కోట్లు అయినా, గజం రూ. 250 అయినా రోజూ కష్టపడి బతికే పేదవాడికి ఏం ఉపయోగం?
* పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో సింహభాగం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఇస్తుంది. ఆ వాస్తవాన్ని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
* హైదరాబాద్‌లోని పేద, మధ్యతరగతి ప్రజలు ’22ఏ’ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవితకాల కష్టార్జితంతో కొనుక్కున్న ఇళ్లు, స్థలాలపై అనిశ్చితి నెలకొంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ సంక్షోభం – విద్యారంగం నిర్లక్ష్యం 

* సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
* బకాయిలు రాక కాలేజీలు నడవక, సర్టిఫికెట్లు అందక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. రాజకీయ ప్రాధాన్యతలకు నిధులు కేటాయించే ప్రభుత్వానికి, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం పైసలు విడుదల చేయడానికి మనసొప్పడం లేదా?
* గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి.

కుదేలైన శాంతిభద్రతలు – మహిళలకు రక్షణ కరవు 

* రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నిన్ననే ఒక గిరిజన (ఎస్టీ) బాలికపై అత్యాచారం, హత్య జరిగింది.
* చట్టాలు చేయాల్సిన, శాసనమండలిలో ప్రజల గొంతుక కావాల్సిన ఒక ఎమ్మెల్సీ — కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి మద్దతిచ్చి గెలిపించిన వ్యక్తి — మైనర్ బాలికపై దాడికి తెగబడ్డాడు.
* రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? రక్షణ ఎక్కడుంది?
* చివరికి ఒక జాతీయ పార్టీ కార్యాలయానికి, నేతలకు కూడా భద్రత లేదు. నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి, ఆయన తల్లిపై కూడా చేయి చేసుకున్నారు. ఇదేనా మీ రాజకీయ సంస్కృతి?

ఎమర్జెన్సీని తలపిస్తున్న నిర్బంధాలు 

* ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నేడు తెలంగాణలో పరిస్థితులు నాటి ఎమర్జెన్సీ కన్నా భయానకంగా ఉన్నాయి.
* మహబూబ్‌నగర్‌లో కాలేజీ విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను అడ్డుకున్నారు. ప్రతిపక్ష నాయకులను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని సైతం హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
* దావోస్ సదస్సులకు ఎన్నిసార్లు వెళ్లారు? ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు? అందులో రాష్ట్రానికి వచ్చిన నిజమైన పెట్టుబడులు, తెచ్చిన పరిశ్రమలు, ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని?

బీఆర్‌ఎస్ – కాంగ్రెస్: ఒకే నాణేనికి రెండు ముఖాలు 

* బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే వీరు మరో రూపంలో కొనసాగిస్తున్నారు.
* వారు ‘ధరణి’తో సమస్యలు సృష్టిస్తే, వీరు భూ సమస్యలతో కొత్త వివాదాలు తెచ్చారు. వారు రీటైల్‌గా దోచుకుంటే, వీరు హోల్‌సేల్‌గా దోచుకుంటున్నారు.
* కాంగ్రెస్ తెస్తామన్న మార్పు ఎక్కడుంది? ఎవరి జీవితాల్లో మార్పు వచ్చింది?

ప్రజా పోరాటమే బీజేపీ మార్గం 

ఈ 1,000 రోజుల కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజలకు ఒక శాపంగా మారింది. ఇది ప్రజా పాలన కాదు — పూర్తిగా ‘ప్రజా వంచన పాలన’. ప్రజల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతుంది. మాపై అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా, అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ చేస్తున్న దాడుల సంస్కృతికి భిన్నంగా, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ప్రజలను ఏకం చేసి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ‘ప్రజా పోరాటం’ సాగిస్తాం.