ఇథనాల్ శాతాన్ని వెల్లడించాలని కోరే పిటిషన్‌ తిరస్కరించిన `సుప్రీం’

ఇథనాల్ శాతాన్ని వెల్లడించాలని కోరే పిటిషన్‌ తిరస్కరించిన `సుప్రీం’
పెట్రోల్ స్టేషన్లలో, డిస్పెన్సింగ్ నాజిల్‌లు, ఫ్యూయల్ బిల్లులతో సహా, పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్ కచ్చితమైన శాతాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. అయితే, ఈ ఫిర్యాదుతో సంబంధిత హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు కోర్టు స్వేచ్ఛను కల్పించింది. 
 
ప్రతి పెట్రోల్ స్టేషన్‌లో అందించే పెట్రోల్‌లోని ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్రానికి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం ఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడిన ధర్మాసనం విచారించింది. తాము కొనుగోలు చేసే ఇంధనం కూర్పును తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని పిటిషనర్ వాదించారు.
 
విచారణ సందర్భంగా, గోస్వామి ఒక పెట్రోల్ రసీదును చూపిస్తూ, “రసీదు చూడండి. దానిపై ఇథనాల్ ప్రస్తావన లేదు. తెలుసుకునే హక్కు నాకు ఉంది” అని తెలిపారు. ప్రతి పెట్రోల్ డిస్పెన్సింగ్ నాజిల్‌పై ఇథనాల్ కచ్చితమైన శాతాన్ని తప్పనిసరిగా, ఏకరీతిగా లేబుల్ చేయాలని ఈ పిటిషన్ కోరింది. ప్రతి ఇంధన ఇన్వాయిస్, బిల్లు లేదా రసీదుపై ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా పేర్కొనాలని ఆదేశాలు జారీ చేయాలని కూడా ఇది కోరింది. 
 
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ అధికారిక వెబ్‌సైట్లు, మొబైల్ అప్లికేషన్లలో, ప్రతి రిటైల్ అవుట్‌లెట్‌లో లభించే ఇథనాల్ శాతాన్ని ప్రచురించాలని, తద్వారా ఆ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని గోస్వామి కోరారు. ఈ పిటిషన్ కేవలం లేబులింగ్ అవసరాలకే పరిమితం కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉండే, వాహనాల వారీగా అనుకూలత డేటాబేస్‌ను కూడా కోరింది.
 
ఈ డేటాబేస్, వాహన తయారీదారు, మోడల్, ఇంజిన్ రకం, తయారీ సంవత్సరం ఆధారంగా సమాచారాన్ని అందిస్తూ, వివిధ ఇథనాల్ మిశ్రమాల అనుకూలతను సూచించాలని ప్రతిపాదించబడింది. పాత లేదా అనుకూలత లేని వాహనాల కోసం ఒక పారదర్శక పరివర్తన చట్రాన్ని కూడా పిటిషనర్ కోరారు. ఇందులో భాగంగా, సాంకేతికంగా, ఆర్థికంగా, లాజిస్టిక్‌గా సాధ్యమైన చోటల్లా తక్కువ ఇథనాల్ ఉన్న పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకురావడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
 
విచారణ సందర్భంగా, కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకట్రామణి, పిటిషన్‌ను అనుసరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్ ప్రభుత్వాన్ని తనకు జవాబుదారీగా చేయాలని పరోక్షంగా కోరుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ డిమాండ్ పౌరుల హక్కులకు సంబంధించినదని, తన వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని గోస్వామి బదులిచ్చారు. 
 
అటార్నీ జనరల్ ఈ పిటిషన్‌ను ఒక “ప్రాక్సీ పిటిషన్”గా అభివర్ణించారు. గత సంవత్సరం సుప్రీంకోర్టు ఇలాంటి పిటిషన్‌నే కొట్టివేసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చివరికి ఈ విషయాన్ని విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది.  పెట్రోల్ పంపుల వద్ద లేదా ఇంధన రసీదులపై ఇథనాల్-కంటెంట్ వెల్లడిని తప్పనిసరి చేస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఉపశమనం కోసం తగిన హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇచ్చారు.