సెలవుపై రాజస్థాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి.. కొత్త నియామకం!

సెలవుపై రాజస్థాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి.. కొత్త నియామకం!
ఒక కీలక పరిణామంలో, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ కె అగర్వాల్‌ను నియమించాలని కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది. రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ప్రకాష్ శర్మ సెలవుపై వెళ్లిన గంటలోపే ఈ నిర్ణయం వెలువడింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం, రాజస్థాన్ హైకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ పుష్పేంద్ర భాటిని జమ్మూ & కాశ్మీర్,  లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కూడా సిఫార్సు చేసింది.
 
సోమవారం సాయంత్రం జరిగిన ఒక సమావేశంలో జస్టిస్ శర్మపై ఉన్న అనేక ఆరోపణలపై చర్చించారు. జస్టిస్ శర్మను సెలవుపై వెళ్లమని కోరడానికి అధికారిక నిర్ణయం ఏదీ తీసుకోనప్పటికీ, ఆయనపై ఉన్న ఆరోపణలను కొలీజియం పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా రాసిన లేఖలు బహిరంగమైన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. 
 
ఆగష్టు 2, ఆగష్టు 10, ఆగష్టు 17 తేదీలలో సీజేఐకి పంపి, సుప్రీం కోర్టు కొలీజియంలోని ఇతర సభ్యులకు కూడా కాపీ చేసిన తన లేఖలలో, జస్టిస్ మెహతా, జస్టిస్ శర్మ “అధికారాలను దుర్వినియోగం” చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, తాత్కాలిక సీజే  “నిజాయితీ”పై “సందేహాలను రేకెత్తించే” “అనేక ఫిర్యాదులు” తనకు అందినట్లు ఆయన తెలిపారు. దీని ఆధారంగా, జస్టిస్ మెహతా తాత్కాలిక సీజేను మరో హైకోర్టుకు బదిలీ చేయాలని, అలాగే కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని కూడా కోరారు. 
 
జస్టిస్ శర్మపై ఉన్న ఆరోపణల పరిశీలనలో, ఫిర్యాదులో ప్రస్తావించినట్లుగా చెబుతున్న ఆయన కొన్ని ఉత్తర్వులను కూడా పరిశీలించవచ్చని కొలీజియం చర్చించింది. ఎలాగూ జస్టిస్ శర్మ సెప్టెంబర్ 26న పదవీ విరమణ చేయనున్నందున, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్న అభిప్రాయం కూడా కొలీజియంలో ఉంది.  
కాగా, జస్టిస్ శర్మకు వ్యతిరేకంగా న్యాయవాదుల సంఘాలు తమ నిరసనలను తీవ్రతరం చేశారు. జైపూర్‌లో కొంతమంది న్యాయవాదులు ఆయన కోర్టు బయట బైఠాయించగా, జోధ్‌పూర్‌లో రెండు న్యాయవాదుల సంఘాలు ఆదివారం వరకు సమ్మెను ప్రకటించి, జస్టిస్ శర్మను న్యాయ, పరిపాలనా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. 
 
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అల్పేష్ యశ్వంత్ కోగ్జే పేరును సుప్రీంకోర్టు కొలీజియం కూడా సిఫార్సు చేసింది. ఈ మూడు కొత్త పేర్లతో, ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఏడు సిఫార్సులు ప్రభుత్వం ముందు పెండింగ్‌లో ఉంటాయి.