నేపాల్‌లో జల విలయం.. 165 మంది మృతి

నేపాల్‌లో జల విలయం.. 165 మంది మృతి
* 300 మంది భారతీయులతో సహా వేయి మందికి పైగా గల్లత్తు!
 
ప్రకృతి సోయగాలతో ఆకట్టుకొనే హిమాలయ దేశం నేపాల్‌లో బుధవారం జలప్రళయం సంభవించింది. హఠాత్తుగా పోటెత్తిన వరద బీభత్సం సృష్టించింది. నేపాల్‌కుపైనున్న టిబెట్‌లో మొదలైన ఆకస్మిక వరదలు సెంట్రల్‌ నేపాల్‌ను దాదాపు తుడిచిపెట్టాయి. ఈ క్రమంలో పలు గ్రామాలు, పట్టణాలు, కీలకమైన వంతెనలు, డజనుకుపైగా జల విద్యుత్తు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. 
 

ఈ ప్రకృతి విలయంలో కనీసం 162 మంది మరణించారని, మొత్తం వేయి మందికి పైగా గల్లంతు కాగా, వారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. , 37 మంది ప్రవాస భారతీయ పర్యాటకులు కూడా ఉన్నారు గల్లంతైన వారిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన వారు ఉన్నారని నేపాల్ పర్యాటక మండలి తెలిపింది.“గంటల వ్యవధిలోనే వరుసగా అనేక పట్టణాలు తుడిచిపెట్టుకుపోయాయి,” అని నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలపై ప్రాథమిక అంచనాలను వివరిస్తూ నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పేర్కొన్నారు.

టిబెట్‌లో బుధవారం 8.37 గంటలకు సంభవించిన భూకంపం కారణంగానే ఆకస్మిక వరదలు సంభవించినట్టు నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనల్‌ పార్లమెంట్‌కు తెలిపారు. భూకంపం కారణంగా వచ్చిన ప్రకంపనల వల్ల మంచుకొండు విరిగిపడ్డాయని, దీంతో వరద పోటెత్తిందని వివరించారు. ఆ వరద భోటే కోశీ నదిలో కలిసి టిబెట్‌కు సరిహద్దున ఉన్న రసువా, ధాడింగ్‌ జిల్లాలను ముంచెత్తిందని తెలిపారు. 

అదేసమయంలో టిబెట్‌ సరిహద్దు వెంబడి ఉన్న లెండే నదిలో కొండచరియలు విరిగిపడటంతో నీటి మట్టం పెరిగి, ఆ నీరు కూడా భోటే కోశీ నదిలో చేరి దిగువనున్న త్రిశూలి నదిలోకి ప్రవేశించిందని జాతీయ విపత్తు నివారణ యాజమాన్యం సంస్థ వివరించింది. ఈ మూడు నదుల నీరు దాదాపు ఆరు జిల్లాలను కకావికలం చేసిందని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు భీతిగొలుపుతున్నాయి.

రాత్రి 10 గంటల సమయానికి 95 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో 500 మంది ఆచూకీ తెలియడం లేదని నేపాల్‌ ప్రభుత్వం వెల్లడించింది. కన్ని పట్టణాల్లో వరదతో కొట్టుకొచ్చిన బురద, మట్టి భవనాలను సగం వరకు ముంచెత్తింది. అంతా నిమిషాల వ్యవధిలో చూస్తుండగానే జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు కన్నీరుమున్నీరయ్యారు. పెద్ద పెద్ద భవనాలు, బహుళ అంతస్తులు, బస్టాండ్లు, వేల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి.

టిబెట్ సరిహద్దు కేంద్రమైన గైరాంగ్‌లో కొండచరియలు విరిగిపడటంతో “భారీ ప్రాణనష్టం” జరిగిందని, ముగ్గురు మరణించారని, మరో 265 మంది గల్లంతయ్యారని చైనా ప్రభుత్వ మీడియా నివేదించింది. సరిహద్దుకు టిబెట్ వైపున ఉన్న నిఘా వీడియోలోని ఒక భయానక దృశ్యంలో, అనేక అంతస్తుల ఎత్తైన భవనంపైకి మట్టి, శిథిలాలతో కూడిన ఒక భారీ గోడ దూసుకువచ్చి, దానిని ముంచివేస్తుండగా, కింద డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. 
 
ఆ ఉప్పెన బస్సులను, కార్లను ఆటబొమ్మల్లా కొట్టుకుపోయింది. నదిలో కొనసాగే అడ్డంకి అదనపు వరదకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరించారు. నేపాల్ పోలీసులు పంచుకున్న చిత్రాలలో, వరద నీరు నదిలో ఉధృతంగా ప్రవహిస్తూ, దారిలోని ఇళ్లను కొట్టుకుపోవడం కనిపించగా, ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పంచుకున్న చిత్రాలలో ఒక ఇంటి పై అంతస్తు బురదమయమైన నేల నుండి బయటకు పొడుచుకువచ్చి కనిపించింది. 
 
జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే రుతుపవన వర్షాలు దక్షిణాసియా అంతటా తరచుగా ప్రాణాంతక వరదలు, కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతున్నాయి. ఈ ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల విపరీత వాతావరణ సంఘటనల సంభవం, తీవ్రత పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాఠ్మండు కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ లో వాతావరణ, పర్యావరణ ప్రమాదాల విభాగాధిపతి అయిన కియాంగ్‌గాంగ్ జాంగ్, రెండవ వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
 

 “నేపాల్-చైనా సరిహద్దు నదిలో ఎగువన ఇంకా ఒక అడ్డంకి ఉన్నందున, రెండవ వరద సంభవించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు,” అని ఆయన ఏఎఫ్‌పీకి తెలిపారు. నీటిలో కొట్టుకుపోయిన వారిలో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది ఉన్నట్టు జగ్గీ వాసుదేవ్‌ తెలిపారు. నేపాల్‌ వెళ్లిన హైదరాబాద్‌, కర్నూలుకు చెందిన సుమారు 300 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలియవచ్చింది.

జాడ లేని 384 మంది కైలాస్‌ యాత్రికులు

కైలాస్‌ మానససరోవర్‌ యాత్రకు సంబంధించిన 384 మంది యాత్రికులు రసువాగధి సరిహద్దు ప్రాంతంలో బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయారు. ఈ యాత్రను రద్దు చేస్తూ నేపాల్‌ ప్రభుత్వం లేదా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఆదేశాలు రాలేదు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రానున్న 48-72 గంటల పాటు యాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేసినట్టు ఖాట్మండులోని టూర్‌ ఆపరేటర్లు ధృవీకరించారు.

నేపాల్‌ పర్యాటక బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం 384 మంది యాత్రికులు అదృశ్యమయ్యారు లేదా వారితో సంబంధాలు తెగిపోయాయి. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. వీరు కైలాస్‌ మానసరోవర్‌ యాత్ర కోసం బుధవారం టిబెట్‌లోకి ప్రవేశించాల్సి ఉంది.