తెలంగాణ ఎస్ఐఆర్ ప్రక్రియలో 92 లక్షల మందికి నోటీసులు

తెలంగాణ ఎస్ఐఆర్ ప్రక్రియలో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ముసాయిదా జాబితా విడుదలైంది. బీఎల్వోలు డిజిటలైజ్ చేసిన సమాచారం ఆధారంగా ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2కోట్ల 64 లక్షల 87వేల ఓట్లను ముసాయిదాలో పొందుపర్చారు. ఇది 78.30శాతంగా ఉంది. ఇందులో 92లక్షల మందికి నోటీసులిస్తామని సీఈవో(ఎన్నికల ప్రధానాధికారి) సుదర్శన్ రెడ్డి తెలిపారు. 60 లక్షల అనామలీస్తో పాటు 32 లక్షల నోమ్యాపింగ్ ఓట్లకు నోటీసులివ్వనున్నారు. 

నోటీసు ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత మరో నెల పాటు అభ్యంతరాలు, వివరణలు తీసుకుంటారు. ప్రక్రియ అంతా ముగిశాక తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.  నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా స్పందించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో మీ పేరు వెతకడానికి ముందుగా మీ ప్రస్తుత పోలింగ్ బూత్, పార్ట్ నంబర్ తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో కొంతమంది ఓటర్ల పాత బూత్ నంబర్లు మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఎన్నికల సంఘం సెర్చ్ పోర్టల్‌లో ఎపిక్ నంబర్ లేదా అందుబాటులో ఉన్న వ్యక్తిగత వివరాలతో మీ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.

 
ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో అర్హత ఉన్నప్పటికీ మీ పేరు కనిపించకపోతే సంబంధిత బీఎల్‌ఓ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, వివరాల్లో మార్పులు లేదా సవరణలకు ఫారం-8, అభ్యంతరాలు లేదా తొలగింపునకు సంబంధించిన ప్రక్రియలో ఫారం-7 ఉపయోగించవచ్చని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.