నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహిస్తున్న ఆందోళనకు సంబంధించి, నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్థాన్కు చెందిన 480 సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించి, బ్లాక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం కోసం అధికారిక వర్గాలపై మాత్రమే ఆధారపడాలని, సోషల్ మీడియాలో ధృవీకరించని కంటెంట్ను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడాన్ని తాము గమనించామని, ఈ నిరసన చుట్టూ తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడానికి పాకిస్థాన్ ఆధ్వర్యంలోని వందలాది ఖాతాలు సమన్వయంతో ప్రచారం చేస్తున్నాయని డీసీపీ సుమిత్ ఝా ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. “సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం అవుతున్నట్లు మేము గమనించాము. ఇప్పటివరకు, ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చేస్తున్న పాకిస్థాన్కు చెందిన 480కి పైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించాము. ఈ ఖాతాలను బ్లాక్ చేస్తున్నాము,” అని పోలీసులు తెలిపారు.
గుర్తించిన హ్యాండిల్స్లో చాలా వరకు ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో కూడా చురుకుగా ఉన్నాయని, ప్రస్తుతం జరుగుతున్న నిరసనలపై ప్రజా చర్చను ప్రభావితం చేయడానికి అదే నెట్వర్క్ ప్రయత్నిస్తోందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. తెలియని లేదా విదేశీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారానికి బలికావద్దని ఢిల్లీ పోలీసులు విద్యార్థులకు, యువతకు విజ్ఞప్తి చేశారు.
పోస్టులను షేర్ చేసే ముందు వాటి ప్రామాణికతను ధృవీకరించుకోవాలని, అప్డేట్ల కోసం అధికారిక మూలాలపై మాత్రమే ఆధారపడాలని, ధృవీకరణ లేకుండా వదంతులు, ఎడిట్ చేసిన వీడియోలు లేదా రెచ్చగొట్టే కంటెంట్ను ప్రచారం చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.
పోలీసుల ప్రకారం, జరుగుతున్న నిరసనల సమయంలో ప్రజలను రెచ్చగొట్టడం, విద్యార్థుల దృష్టిని మళ్లించడం ఈ ఖాతాల ఉద్దేశం. “ప్రజలను రెచ్చగొట్టడం, ముఖ్యంగా విద్యార్థులను తప్పుదోవ పట్టించడం మాత్రమే వారి లక్ష్యం,” అని పేర్కొన్న పోలీసులు, తప్పుడు సమాచారం నుండి యువతను రక్షించడం తమకు ప్రాధాన్యత అని తెలిపారు.
మరోవైపు, సిజెపి నేతృత్వంలోని నిరసనల గురించి స్పందించడానికి పాకిస్థాన్ నిరాకరించింది. ఈ వ్యవహారం భారతదేశ అంతర్గత విషయమని పేర్కొంది. నిరసనకారుల పట్ల భారత అధికారులు వ్యవహరించిన తీరు మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా? అన్న ప్రశ్నకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అండ్రాబీ స్పందిస్తూ, “ఇది భారతదేశ అంతర్గత విషయం. ఇలాంటి అంశాలపై మేము వ్యాఖ్యానించము,” అని తెలిపారు.

More Stories
ఇస్రోలో యువతకు ఇంటర్న్షిప్ అవకాశం
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు, నిహంగ్ సిక్కుల మధ్య ఘర్షణ
అస్సాంలో ఉగ్రరూపం దాల్చిన నదులు… వర్షాలకు 41 మంది మృతి