ఇక ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు

ఇక ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు
దేశంలో డిజిటల్ పేమెంట్స్ సిస్ట‌మ్‌ లో మరో విప్లవాత్మక మార్పు రాబోతున్న‌ది. ఇంటర్నెట్ కనెక్ష‌న్‌ లేని ప్రాంతాల్లోనూ సులభంగా యూపీఐ చెల్లింపులు జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  (ఎన్‌పీసీఐ)  ఒక కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్న‌ది. దీని ద్వారా యూజర్ ఫోన్, వ్యాపారి వద్ద ఉండే ‘పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్‌ఓ)’ టెర్మినల్ రెండూ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ  రూ.2,000 వరకు చెల్లింపులు చేయవచ్చు.
 
ఈ సదుపాయాన్ని నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా ‘ట్యాప్-టు-పే’ విధానంలో తీసుకురానున్నారు. ఈ కొత్త ఫీచర్ పనితీరుపై అందుతున్న సమాచారం ప్రకారం వినియోగదారులు ముందుగా తమ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉన్నప్పుడు ‘ఆన్-డివైస్ యూపీఐ లైట్ వ్యాలెట్‌’ లోకి న‌గ‌దును లోడ్ చేసుకోవాలి. 
 
ఆ తర్వాత ఇంటర్నెట్ సిగ్నల్ లేని ప్రదేశాల్లో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, తమ ఎన్ఎఫ్‌సీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను వ్యాపారి వద్ద ఉన్న సర్టిఫైడ్ ఆఫ్‌లైన్ పీఓఎస్‌ టెర్మినల్‌పై ట్యాప్ చేస్తే చాలు. ఎలాంటి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే లావాదేవీ పూర్తవుతుంది. ఈ లావాదేవీ వివరాలను పీఓఎస్‌ టెర్మినల్ తనలో స్టోర్ చేసుకొని, తిరిగి ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చిన వెంటనే సెటిల్‌మెంట్ కోసం పంపుతుంది. 
 
ముఖ్యంగా విమానాలు, భూగర్భ మెట్రో స్టేషన్లు, మారుమూల గ్రామాలు వంటి నెట్‌వర్క్ సరిగాలేని లేదా అసలు లేని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ ఫీచర్‌ను రూపొందిస్తున్నారు. దీనివల్ల ప్రయాణ సమయాల్లో, సిగ్నల్ సమస్యలు ఎదురయ్యే చోట్ల డిజిటల్ చెల్లింపుల విశ్వసనీయత, సౌలభ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రముఖ తయారీదారుల నుంచి పీఓఎస్‌ టెర్మినల్స్‌కు ధ్రువీకరణ పత్రాలు జారీచేసే ప్రక్రియను ఎన్‌పీసీఐ ప్రారంభించవచ్చని తెలుస్తున్న‌ది.

భారత్‌లో యూపీఐ లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఒక్క జూన్ నెలలోనే 22.72 బిలియన్ల లావాదేవీల ద్వారా రూ.28.92 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. అయినప్పటికీ, కనెక్టివిటీ సమస్యలు దీని పూర్తిస్థాయి వినియోగానికి అడ్డంకిగా ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల పరిమితి ఒక లావాదేవీకి రూ.500 కాగా, యూపీఐ లైట్ ఎక్స్ పరిమితి కూడా రూ.500 గానే ఉంది.

అయితే, కొత్తగా రాబోయే ఈ పీఓఎస్‌ ఆఫ్‌లైన్ ఫీచర్ కోసం లావాదేవీ పరిమితిని రూ.2,000కు పెంచడం ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది ప్రయాణికుల చిన్న చిన్న ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను ఎన్‌పీసీఐ త్వరలో విడుదల చేయనుంది..