గోదావరి జలాల వినియోగంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లో సాంకేతిక లోపాలను సరిదిద్దే వరకు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గోదావరి జలాలు, బనకచర్ల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంలో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని కోర్టుకు విన్నవించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులపై తాత్కాలిక నిలుపుదల (ఇంజెక్షన్) ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రధాన పిటిషన్లోనే పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. అందులో ఉన్న లోపాలను సరిదిద్దకుండా కేసు విచారణను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
ముందుగా నిబంధనలకు అనుగుణంగా ఆ పిటిషన్ను సవరించాలని, ఆ తర్వాతే కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. పిటిషన్ను విచారణకు స్వీకరించకముందే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం లేదా ఈ వ్యవహారంలో తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడం న్యాయపరంగా సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆ పిటిషన్లోని లోపాలను సరిచేసిన తర్వాత తిరిగి దానిపై విచారణ చేపట్టి, మిగిలిన న్యాయపరమైన అంశాలపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో పోలవరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగం , బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన వివాదంలో ఏం జరగనుంది? అనే పరిణామాలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి సుప్రీంకోర్టు తదుపరి విచారణపైనే నిలిచింది.

More Stories
సేవా భారతి ఆధ్వర్యంలో డా. హెడ్గేవార్ బ్లడ్ సెంటర్
మూడు కార్పొరేషన్లపై బిజెపి జెండా ఎగరడం ఖాయం
మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను వేంటనే పరిష్కరించాలి