వైద్యురాలు, సిబ్బందిపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్‌ అరెస్ట్‌

వైద్యురాలు, సిబ్బందిపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్‌ అరెస్ట్‌
కళ్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) ఆధ్వర్యంలోని శాస్త్రీనగర్ ఆసుపత్రిలో ఓ మహిళా వైద్యురాలు, నర్స్ తో సహా  సిబ్బందిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి శివసేన కార్పొరేటర్ రమేష్ మ్హాత్రేను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై మ్హాత్రే, మరో ఐదుగురిపై కేసు నమోదైన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న ఈ మున్సిపల్ ఆసుపత్రిలో, ఒక నవజాత శిశువుకు మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించినప్పుడు ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
 
ఈ సూచన కారణంగా మొదలైన వాగ్వాదం, ఆ తర్వాత వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై భౌతిక దాడిగా మారింది. సోమవారం సాయంత్రం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ వివాదం మొదలైంది. ఈ వీడియో ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించగా, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు డిమాండ్ చేశారు. 
 
పోలీసుల వివరాల ప్రకారం, నవజాత శిశువును మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించిన తర్వాత, కార్పొరేటర్ మ్హాత్రే, అతని అనుచరులు ఇద్దరు వైద్యులు, ఇతర ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ప్రజల నుండి పెరుగుతున్న ఒత్తిడి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) వ్యక్తం చేసిన అభ్యంతరాల నేపథ్యంలో, మంగళవారం రాత్రి పోలీసులు మ్హా,  మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 
 
తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆ ప్రాంతంలోని క్లినిక్‌లు, ఆసుపత్రులను మూసివేస్తామని ఐఎంఎ హెచ్చరించింది. ఇదే సమయంలో, థానే లోక్‌సభ ఎంపీ నరేష్ మ్హాస్కే ఢిల్లీ నుండి స్పందిస్తూ, ఈ ఘటనతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, సదరు కార్పొరేటర్‌పై క్రమశిక్షణ చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. 
 
“జరిగిన ఘటనకు పార్టీ మద్దతు ఇవ్వలేదు, భవిష్యత్తులోనూ ఇవ్వదు. ఈ దాడికి మ్హాత్రేనే పాల్పడ్డారు. ఆయన ఐదారు సార్లు ఎన్నికైన సీనియర్ నాయకుడు అయినప్పటికీ, పార్టీ ఇటువంటి ప్రవర్తనను సహించదు,” అని మ్హాస్కే పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్‌కు పార్టీ నాయకత్వం ‘షో-కాజ్ నోటీసు’ జారీ చేసిందని ఆయన తెలిపారు.
 
“క్రమశిక్షణ చర్యల విషయంలో పార్టీ అత్యున్నత నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. తదుపరి చర్యలపై మా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాకుండా, చట్ట అమలు సంస్థలు చేపట్టే చట్టపరమైన చర్యలకు పార్టీ ఎక్కడా అడ్డుపడదు లేదా జోక్యం చేసుకోదు,” అని మ్హాస్కే తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు.