సహనం కోల్పోయి కార్యకర్తలపై చేయిచేసుకున్న మమత

సహనం కోల్పోయి కార్యకర్తలపై చేయిచేసుకున్న మమత

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (మమతా వర్గం) అధినేత్రి మమతా బెనర్జీ సహనం కోల్పోయారు. ర్యాలీ అనంతరం తలెత్తిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బరుయిపూర్‌లో బాలికపై అత్యాచారం, హత్యకు నిరసనగా బుధవారం టీఎంసీ యువజన విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది.

కలకత్తా హైకోర్టు అనుమతితో బల్లిగంజ్ ఫారీ నుంచి హజ్రా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అయితే బీజేపీ మద్దతుదారులు ర్యాలీలోకి చొరబడి అడ్డుకునేందుకు ప్రయత్నించారని టీఎంసీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తోపులాట, భౌతిక దాడులకు దారి తీసింది, ఈ ఘర్షణలో టీఎంసీ యువజన, విద్యార్థి విభాగాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు మమతా బెనర్జీ వాహనాలు ఏర్పాటు చేశారు.

ఆ వాహనాలు వెళ్లేందుకు తన నివాసం వెలుపల మార్గాన్ని ఖాళీ చేయాలని పార్టీ కార్యకర్తలను ఆమె కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలపై ఆగ్రహంతో అరిచారు. మరోవైపు ఈ గందరగోళం మధ్య మమతా బెనర్జీ తన సహనాన్ని కోల్పోయారు. తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన పార్టీ కార్యకర్త చెంపపై కొట్టారు. అలాగే మరికొందరిపైనా ఆమె చేయి చేసుకున్నారు. మీడియా కెమెరాల్లో రికార్డైన ఈ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఆ తర్వాత వెంటనే, బెనర్జీ ఆ వ్యక్తి వైపు వేలు చూపిస్తూ, అక్కడి నుండి వెళ్ళిపొమ్మని కోరుతున్నట్లుగా కనిపించారు. ఆమె ర్యాలీని కొనసాగిస్తుండగా, చుట్టూ ఉన్న ప్రజలు ఆ వ్యక్తిని అక్కడి నుండి దూరంగా తీసుకువెళ్లారు. ఈ ఘటన వెనుక ఖచ్చితమైన కారణం అస్పష్టంగానే ఉంది. బెనర్జీ ప్రతిచర్యకు దారితీసిన కారణం ఏమిటో తెలియరాలేదు. ఈ విషయంపై తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

 
బీజేపీ మద్దతుదారులు ఊరేగింపును అడ్డుకున్నారని, మహిళలతో సహా టీఎంసీ కార్యకర్తలపై దాడి చేశారని, కోర్టు ఆదేశాలను విస్మరించారని బెనర్జీ ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడటానికి బదులుగా పోలీసులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని కూడా ఆమె పేర్కొన్నారు. ఉదయం నుంచి తన నివాసంపై పోలీసులు నిఘా ఉంచారని టీఎంసీ నాయకురాలు ఆరోపించారు.
కోర్టు అనుమతి ఉన్నప్పటికీ అధికారులు హ్యాండ్ మైక్రోఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారని, అదే సమయంలో బీజేపీ మద్దతుదారులను పెద్దగా సంగీతం పెట్టుకోవడానికి , మార్గంలో అడ్డంకులు ఏర్పాటు చేయడానికి అనుమతించారని ఆమె ఆగ్రహం  చేశారు.  ఒక సీనియర్ టీఎంసీ నాయకుడిని చుట్టుముట్టారని విన్న తర్వాత, గాయపడిన పార్టీ కార్యకర్తలను తాను స్వయంగా చూశానని బెనర్జీ పేర్కొన్నారు. పోలీసుల చర్యలు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ, తమ పార్టీ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తుందని బెనర్జీ తెలిపారు.