జూన్ లో సాధారణం కంటే 42% తక్కువగా వర్షపాతం

జూన్ లో సాధారణం కంటే 42% తక్కువగా వర్షపాతం
భారతదేశ వ్యాప్తంగా జూన్‌ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42 శాతం తక్కువగా నమోదైంది. గత దశాబ్దన్నర కాలంలో వేసవి రుతు పవనాలకు ఇది అత్యంత బలహీనమైన ఆరంభం. దీని ఫలితంగా దేశంలోని 76 శాతం ప్రాంతాల్లో వర్షపాతం ‘లోటు’, లేదా ‘తీవ్ర లోటు’గా ఉంది. జూలై కూడా సాధారణం కంటే పొడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

సాగునీరు, తాగునీటి కోసం పర్యవేక్షించే దేశంలోని 166 ప్రధాన జలాశయాలు జూన్‌ 25 నాటికి మొత్తం నిల్వ సామర్థ్యంలో 26 శాతాన్ని కలిగి ఉన్నాయి. నీటి మట్టాలు ఇందిరా సాగర్‌లో 14 శాతానికి, నాగార్జున సాగర్‌లో 5 శాతానికి, తెహ్రీలో 2 శాతానికి పడిపోయాయి. పసిఫిక్‌లో పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల(ఎల్‌ నినో అనే పరిస్థితి) కారణంగా ఆ నెలలో రుతుపవన వర్షపాతం మళ్లీ పుంజుకున్నప్పటికీ జూలై నెలలో చాలావరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

తన చరిత్రలోనే ఐరోపా అత్యంత తీవ్రమైన వడడ్పులను ఎదుర్కొంటున్న తరుణంలో భారత రుతుపవనాలు బలహీనపడ్డాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కాలానుగుణ సగటు కంటే 5 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవుతున్నాయి. 

 
ఉత్తర ఆఫ్రికా నుండి వేడి గాలిని రప్పించే స్థిరమైన అధిక పీడన వ్యవస్థ కారణంగా ఏర్పడిన వడగాడ్పులు మానవ ప్రేరిత వాతావరణ మార్పుల వల్ల మరింత తీవ్రమయ్యాయని వరల్డ్‌ వెదర్‌ అట్రిబ్యూషన్‌ అనే బహుళ దేశాల పరిశోధక బృందం  తెలిపింది. ఐరోపా వేసవి వాతావరణంపై ఎల్‌ నినో ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
 
నైరుతి రుతుపవనాలు దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించినప్పటికీ, ఈ ఏడాది ఢిల్లీ, వాయువ్య భారతదేశంలోని ఆనుకోని ప్రాంతాలకు వాటి రాక ఆలస్యమైంది. సాధారణ పరిస్థితులలో, రుతుపవనాలు జూన్ 27 నాటికి జాతీయ రాజధానిని చేరుకుంటాయి. ఉత్తరాన నెలకొన్న పొడి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా, ఈశాన్య రాష్ట్రాలు రుతుపవన కార్యకలాపాలను ఉధృతంగా ఎదుర్కొంటున్నాయి. 
 
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, దీంతో ఐఎండి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. భారతదేశం మండే ఎండల నుండి కుండపోత వర్షాల వరకు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నందున, ప్రాణాలను, జీవనోపాధిని, వ్యవసాయ కార్యకలాపాలను కాపాడటానికి సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం, అధికారిక వాతావరణ నవీకరణలను నిశితంగా పర్యవేక్షించడం చాలా అవసరం.