వెనిజులాకు మానవతా సహాయంపై వేగంగా స్పందించిన భారత్ 

వెనిజులాకు మానవతా సహాయంపై వేగంగా స్పందించిన భారత్ 
దేశ ఉత్తర భాగంలో వినాశకరమైన భూకంపం సంభవించిన తరువాత, వెనిజులాకు మానవతా సహాయాన్ని అందించడానికి భారతదేశం వేగంగా స్పందించింది. సహాయక, అత్యవసర ప్రతిస్పందన ప్రయత్నాలకు మద్దతుగా ‘ఆపరేషన్ అమిస్టాడ్’ కింద భారత సైన్యం ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని పంపింది. 60 పారా ఫీల్డ్ హాస్పిటల్‌కు చెందిన భారత సైన్యపు వైద్య బృందం జూన్ 26న హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరి, ప్రస్తుతం రెండు భారత వైమానిక దళ విమానాలలో వెనిజులాకు ప్రయాణిస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
 “60 పారా ఫీల్డ్ హాస్పిటల్‌కు చెందిన వైద్య బృందం జూన్ 26 మధ్యాహ్నం హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరి, ప్రస్తుతం రెండు భారత వైమానిక దళ విమానాలలో వెనిజులాకు ప్రయాణిస్తోంది,” అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ బృందంలో తొమ్మిది మంది వైద్య అధికారులతో సహా 41 మంది సిబ్బంది ఉన్నారు.
అంతకుముందు, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘ఎక్స్’  వేదికగా చేసిన పోస్ట్‌లో, ఈ సహాయంలో ఒక ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలు (రెండు ‘భీష్మ్ క్యూబ్స్’తో సహా) ఉన్నాయని తెలిపారు.  
భూకంప బాధితులకు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సహాయం, మానసిక గాయాల నిర్వహణ, ప్రాణరక్షక శస్త్రచికిత్స సహాయం, ఇతర కీలక వైద్య సేవలను అందించడానికి వీరు సన్నద్ధులై ఉన్నారు. ఈ బృందం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన దాదాపు ఆరు టన్నుల వైద్య సామాగ్రి, మానవతా సహాయ సరఫరాలను తీసుకువెళుతోంది.  ఈ మిషన్ కోసం భారత వైమానిక దళం రెండు సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలను మోహరిస్తోంది.
ఈ విమానాలలో ఒకటి, భారతదేశపు ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ కింద ‘భీష్మ్ క్యూబ్’ను కూడా రవాణా చేస్తుంది. స్వదేశీ, వేగంగా మోహరించగల ఈ మాడ్యులర్ వైద్య సదుపాయం విపత్తు, మానవతా సహాయక చర్యల కోసం రూపొందించారు. దీనిని ఒక క్రియాశీలక ఫీల్డ్ ఆసుపత్రిగా సమీకరించవచ్చు.  ఇది 200 మంది రోగుల వరకు అధునాతన ట్రామా కేర్, అత్యవసర శస్త్రచికిత్సలు, ఇంటెన్సివ్ కేర్ సపోర్ట్ , అవసరమైన చికిత్సను అందించగలదు. ఈ సదుపాయంలో పోర్టబుల్ వెంటిలేటర్లు, పేషెంట్ మానిటర్లు, డయాగ్నస్టిక్ సిస్టమ్‌లు, శస్త్రచికిత్స పరికరాలు, విద్యుత్ ఉత్పత్తి మరియు ఆక్సిజన్ సహాయక వ్యవస్థలు ఉన్నాయి.
 “ఆపరేషన్ అమిస్టాడ్ కింద వైద్య బృందాన్ని పంపడం అనేది మానవతా సహాయం, విపత్తుల నుండి ఉపశమనం పట్ల భారతదేశపు శాశ్వత నిబద్ధతను, అలాగే సంక్షోభ సమయాల్లో మిత్ర దేశాలకు సకాలంలో మద్దతు అందించడానికి దాని సంసిద్ధతను ప్రతిబింబిస్తుంది,” అని అధికార ప్రతినిధి తెలిపారు.