40 మంది ఆర్మీ సిబ్బందిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్

40 మంది ఆర్మీ సిబ్బందిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్
కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా 40 మంది ఆర్మీ సిబ్బందిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కిష్టావర్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌‌పై దాడిచేయడమే కాకుండా, అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు, పోలీసులను కొట్టారనేది ప్రధాన ఆరోపణ. అథోలి పోలీస్ స్టేషన్‌పై 17 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్ అరుణ్ గాంధీ, మేజర్ వికాస్ శర్మ, నయిబ్ సుబేదార్ శంకర్ గుర్ఖేతో పాటు 30 నుంచి 40 మంది జవాన్లు దాడికి పాల్పడినట్టు ఎప్ఐఆర్‌లో పేర్కొన్నారు.
హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర సెక్షన్లు నమోదయ్యాయి. దీనిపై స్పందించిన ఆర్మీ విచారణకు సహకరిస్తామని తెలిపింది.“ఈ అంశం సంబంధిత సంస్థాగత యంత్రాంగాల ద్వారా పరిశీలనలో ఉంది. న్యాయ ప్రక్రియలో భారత సైన్యం పూర్తి సహకారం అందిస్తుంది. సంయుక్త దర్యాప్తు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. దర్యాప్తు కొనసాగుతున్నందున, ఈ దశలో దీనిపై మరింత వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది’’ అని ఒక రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.
సైనికుల దాడికి గురైన వారిలో అథోలి పోలీస్ స్టేషన్ డీఎస్పీ విజయ్ కుమార్ భగత్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమృత్ కటోచ్ తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది. కిష్టావర్ జిల్లా కమిషనర్ పద్దర్‌లోని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నప్పుడు సైనికులు పోలీస్ స్టేషన్‌లోకి చొరబడ్డారని ఎస్‌హెచ్ఓ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పేర్కొన్నారు. 
 
పోలీస్ స్టేషన్ లోపల హింసాత్మక ఘటన జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే, తాను పోలీస్ స్టేషన్‌కు తిరిగి వచ్చానని ఆయన తెలిపారు. ‘‘నేను పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే, మేజర్ వికాస్ శర్మ నేతృత్వంలో సైనికులు నాపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో, వారు నా యూనిఫాం చించి, అథోలి డీఎస్పీ విజయ్ కుమార్ భగత్‌పై కూడా భౌతిక దాడికి దిగారు’’ అని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. 
 
ఇది పథకం ప్రకారం జరిగిన దాడేనని, పలువురు పోలీసులు గాయపడ్డారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం  సైనికులు లాఠీలు, ఇనుప రాడ్లు, వారి సర్వీసు ఆయుధాలతో ప్రధాన గేటు, ప్రహరీ గోడలను ఎక్కి పోలీస్ స్టేషన్‌లోకి బలవంతంగా ప్రవేశించారు. నివేదికల ప్రకారం, కిష్టావర్ అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ సైన్యానికి చెందిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 
 
స్టేషన్‌పై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆర్టీఓ, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారులపై కూడా సైనికులు దాడి చేశారని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. ‘‘ఆర్టీఓ , అథోలి పోలీస్ స్టేషన్  ఎస్‌హెచ్ఓ, డీఎస్పీ వాహనాలను ధ్వంసం చేసి, మెయిన్ గేటును పగలగొట్టి, ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు కూడా తీవ్ర నష్టం కలిగించారు’’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిందని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ‘చంపాలని’ సైనికులు కోరుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

‘‘పూర్తిస్థాయిలో సిద్ధమై లాఠీలు, ఇనుప రాడ్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రితో మెయిన్ గేటు, ప్రహరీ గోడలను దూకి అథోలి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి చొరబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి ప్రాణాంతక గాయాలు కలిగించి, వారిని చంపాలన్నది వారి ఉద్దేశం. బలవంతపు ప్రవేశం, దాడి గురించి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ అందిన వెంటనే, నేను హుటాహుటిన వచ్చాను’’ అని పోలీస్ అధికారి వివరించారు.