పూణే ఆలయం వద్ద పాకిస్థాన్ లో తయారైన దుప్పటి!

పూణే ఆలయం వద్ద పాకిస్థాన్ లో తయారైన దుప్పటి!

ఒక ఆలయం ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సంతలో కొనుగోలు చేసిన ఓ దుప్పటిని ఇంటికి వెళ్లి చూసుకోగా `పాకిస్థాన్ లో తయారు’ అని దానిపై ఉండడంతో ఒక మహిళ దిగ్బ్రాంతికి గురయిది. ఈ విషయాన్ని వీడియోలో షేర్‌ చేసింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. జూన్‌ 3న ‘సంకష్టి చతుర్థి’ పండుగ సందర్భంగా పింప్రి-చించ్‌వాడ్‌లోని మోరయా గోసావి ఆలయం వద్ద ఉత్సవం జరిగింది. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో పూజా సరాఫ్ అనే మహిళ ఒక బెడ్‌షీట్‌తో పాటు కొన్ని వస్తువులు కొనుగోలు చేసింది. దీని గురించి సోషల్‌ మీడియాలో ఒక వీడియో పోస్ట్‌ చేసింది. ‘మనం ఎక్కడ నివసిస్తున్నాం? సరిహద్దు ప్రాంతంలో కూడా లేము కదా? అయినా సరే, మన ఇంట్లో ఇలా ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ వస్తువు ఉండటం ఏమిటి?’ అని ఆమె ప్రశ్నించింది.

మరోవైపు ఈ సంఘటన పట్ల తనకు చాలా బాధగా ఉన్నదని, తన లాంటి చాలా మంది హిందువులు అక్కడ ఇలాంటి దుప్పట్లు కొనుగోలు చేసి వారి ఇళ్లకు తీసుకెళ్లినట్లు ఆమె వాపోయింది. ‘వస్తువులు కొనేటప్పుడు కళ్లు తెరిచి చూసుకోవాలి. ఇప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి’ అని ఆమె అన్నది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నుంచి దిగుమతి, ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధం విధించింది. అయినప్పటికీ ఆ దేశ వస్తువుల అమ్మకాలు జరుగుతున్నట్లు తాజా సంఘటన ద్వారా బయటపడింది. దీంతో పింప్రి-చించ్‌వాడ్ పోలీసులు ఆ మహిళ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. పాక్‌ ఉత్పత్తులను విక్రయించే విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పింప్రి-చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా కోరారు.