రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శ‌ర్మ ప్రమాణం

రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శ‌ర్మ ప్రమాణం

 అస్సాం ముఖ్య‌మంత్రిగా ఇవాళ హిమంత బిశ్వ శ‌ర్మ మంగళవారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం వ‌రుస‌గా ఇది రెండోసారి.  గౌహతిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ల‌క్ష్మ‌ణ్ ప్ర‌సాద్ ఆచార్య ఆయ‌న చేత‌ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అస్సాంలో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి. 

తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. సుమారు లక్ష మంది ఎన్డీఏ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదిలా ఉండగా, అసోం ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వేదిక వద్ద ఒక వ్యక్తి బుల్లెట్ల పట్టుపడడం కలకలం రేపింది. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకోగా, అతడి వద్ద కొన్ని తూటాలు ఉన్నట్లు తెలిపారు. ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానం ప్రవేశ ద్వారం వద్ద జరిగిన భద్రతా తనిఖీల సమయంలో ఆ వ్యక్తి నుంచి ఈ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణ నిమిత్తం అతడిని అదుపులోకి తీసుకున్నామని అధికారి చెప్పారు.

అయితే, ఆ వ్యక్తి నుంచి ఎటువంటి ఆయుధాలు మాత్రం లభించలేదని ఆయన స్పష్టం చేశారు.  తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఎన్డీఏ బృందానికి 102 సీట్లు వ‌చ్చాయి. అస్సాం అసెంబ్లీలో 126 మంది స‌భ్యులు ఉండ‌గా, దాంట్లో బీజేపీ 82 స్థానాల‌ను చేజిక్కించుకున్న‌ది. ఏజీపీ, బీపీఎఫ్ పార్టీలు చెరి ప‌ది సీట్లు గెలుచుకున్నాయి.