హోర్ముజ్ జలసంధిని ఇరాన్ త్వరగా తెరవాలి.. చైనా 

హోర్ముజ్ జలసంధిని ఇరాన్ త్వరగా తెరవాలి.. చైనా 
హోర్ముజ్ జలసంధిని త్వరగా తిరిగి తెరవాలని చైనా ఇరాన్‌ను కోరింది. సాధారణ సముద్ర రవాణాను పునరుద్ధరించడం ప్రపంచ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. బీజింగ్‌లో జరిగిన చర్చల సందర్భంగా, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీతో మాట్లాడుతూ, ఈ కీలక జలమార్గాన్ని స్థిరీకరించడానికి ప్రపంచం త్వరితగతిన చర్యలు ఆశిస్తోందని చెప్పారు.
 
టెహ్రాన్‌కు ఇచ్చిన ఒక ముఖ్యమైన సందేశంలో, అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదనే ఇరాన్ వైఖరిని వాంగ్ ప్రశంసించారు. సుసంపన్నం చేసిన యురేనియం నిల్వలను అప్పగించాలని, అలాగే 20 ఏళ్ల పాటు అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తామని వాషింగ్టన్ ఇరాన్‌పై ఒత్తిడి తెస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతియుత అణుశక్తిని సాధించే ఇరాన్ హక్కును చైనా గౌరవిస్తుందని వాంగ్ చెప్పారు. 

వచ్చే వారంలో చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్‌‌తో అమెరికా అధ్యక్షుడు శిఖరాగ్ర సమావేశం జరుగనున్న నేపథ్యంలో అరాగ్చి వాంగ్‌‌యితో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో చైనా తమకు సన్నిహిత మిత్రదేశమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలపడుతుందని అరాఘ్చి అన్నట్లు ఇరాన్ స్టూడెంట్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

అలాగే చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని చెబుతూ తాము కేవలం న్యాయమైన, సమగ్రమైన ఒప్పందాన్ని మాత్రమే అంగీకరిస్తామని అరాగ్జి స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్‌‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం వల్ల ప్రాంతీయ ఇంధనం, మౌలికసదుపాయాలతోపాటు, ప్రపంచ చమురు, గ్యాస్‌ ‌సరఫరాలకు అంతరాయం కలుగుతోంది. దీనివల్ల తీవ్ర ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయి. ఈ యుద్ధాన్ని ముగించడానికి అమెరికాతో జరుగుతున్న చర్చల గురించి కూడా అరాగ్జి వాంగ్‌‌యితో చర్చించారు.

ఫిబ్రవరి చివరిలో అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి తొలిసారిగా బీజింగ్‌ను సందర్శించిన అరాఘ్చి, వాషింగ్టన్‌తో కొనసాగుతున్న చర్చల గురించి వాంగ్‌కు వివరించారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ఒక కీలక ప్రాధాన్యతగా మిగిలి ఉందని ఆయన నొక్కిచెప్పారు. అలాగే, శాశ్వత పరిష్కారం కోసం దౌత్యపరమైన సంప్రదింపులను కొనసాగిస్తూనే, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలనే టెహ్రాన్ సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

మరోవైపు, ఇరాన్, సౌదీ విదేశాంగ మంత్రులు ప్రాంతీయ సంక్షోభంపై చర్చించడానికి ఫోన్‌లో సంభాషించారు. ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగకుండా నిరోధించడానికి నిర్మాణాత్మక దౌత్యం, సహకారం అత్యవసరం అని ఇరుపక్షాలు అంగీకరించాయి.