ఇరాన్‌తో అమెరికా ఘర్షణలు `ముగిసాయి’

ఇరాన్‌తో అమెరికా ఘర్షణలు `ముగిసాయి’
 
* చట్ట సభలకు స్పష్టం చేసిన అధ్యక్షుడు ట్రంప్ 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో అమెరికా ఘర్షణలు “ముగిశాయని” కాంగ్రెస్ నాయకులకు తెలిపారు. ఏప్రిల్ ఆరంభం నుండి కొనసాగుతున్న కాల్పుల విరమణ, ఎటువంటి కాల్పుల మార్పిడి జరగకపోవడాన్ని ఆయన ఉదహరించారు. అయితే, ఈ ఘర్షణకు అధికారిక అనుమతి అవసరమా? అని చట్టసభ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 
 
హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్, సెనేట్ ప్రెసిడెంట్ ప్రో టెంపోర్ చక్ గ్రాస్లీలకు శుక్రవారం పంపిన లేఖలలో, ఏప్రిల్ 7న మొదట ఆదేశించిన కాల్పుల విరమణను పొడిగించిన తర్వాత పోరాటం వాస్తవంగా ముగిసిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఏప్రిల్ 7, 2026న, నేను 2 వారాల కాల్పుల విరమణకు ఆదేశించాను. అప్పటి నుండి కాల్పుల విరమణ పొడిగించబడింది. ఏప్రిల్ 7, 2026 నుండి అమెరికా, ఇరాన్ మధ్య ఎటువంటి కాల్పుల మార్పిడి జరగలేదు,” అని ట్రంప్ రాశారు. 
 
“ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయి.” ఈ లిఖితపూర్వక ప్రకటన, ఒక రోజు ముందు సెనేట్ విచారణ సందర్భంగా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యల తర్వాత వచ్చింది. ఆ విచారణలో, ఘర్షణ 60 రోజుల గడువును దాటినందున, యుద్ధ అధికారాల నిబంధనల ప్రకారం ప్రభుత్వం కాంగ్రెస్ నుండి ఆమోదం పొందాలా? అనే ప్రశ్నలను ఆయన ఎదుర్కొన్నారు. 
 
కాంగ్రెస్ అనుమతి లేకపోవడంపై ఇరు పార్టీల చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘ సైనిక జోక్యానికి శాసనసభ ఆమోదం అవసరమని వారు వాదించారు. తన లేఖలో, “అమెరికాకు, దాని సైన్యానికి ఇరాన్ నుండి పొంచి ఉన్న ముప్పు గణనీయంగానే ఉంది” అని ట్రంప్ అంగీకరించారు.  అయినప్పటికీ, తన రాజ్యాంగబద్ధమైన అధికారం కింద అమెరికా బలగాలను నడిపించడం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. “నా బాధ్యతలకు అనుగుణంగా, అమెరికా విదేశీ సంబంధాలను నిర్వహించే నా రాజ్యాంగబద్ధమైన అధికారం మేరకు నేను అమెరికా బలగాలను నడిపించడం కొనసాగిస్తాను,” అని ఆయన రాశారు.
మధ్యప్రాచ్య సంఘర్షణలో కొనసాగుతున్న ప్రతిష్టంభన అన్ని ప్రాంతాల మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతూ, చమురు ధరలను చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి నెడుతున్నప్పటికీ, అమెరికా ఇరాన్‌తో “యుద్ధంలో లేదు” అని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఇరాన్‌తో కాల్పుల విరమణ, సైనిక చర్యకు కాంగ్రెస్ ఆమోదం అవసరమయ్యే చట్టపరమైన గడువును సమర్థవంతంగా “తాత్కాలికంగా నిలిపివేస్తుందని” వారు భావిస్తున్నారు.

“ఆ 60 రోజుల గడువు బహుశా రేపటితో ముగుస్తుందని నేను అనుకుంటున్నాను. అది ప్రభుత్వానికి సంబంధించి ఒక అత్యంత కీలకమైన న్యాయపరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది”అని డెమోక్రాటిక్ సెనేటర్ కెయిన్ తెలిపారు.