పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఎంసీ గూండాలు తమను బెదిరిస్తున్నారంటూ సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టాలో స్థానికులు ఆందోళన బాటపట్టారు. అంతేకాదు, తమ ప్రాంతంలో రీపోలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, కేంద్ర బలగాలైన సీఏపీఎఫ్ను మోహరించి, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫాల్టాలో స్థానికులు రోడ్లు, వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనిపై స్పందించిన స్థానిక అధికారులు భద్రతను పెంచారు. సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ దళాల్ని మోహరించారు. శాంతి భద్రతల్ని పర్యవేక్షించేందుకు అనేక చోట్ల సీఆర్పీఎఫ్ వాహనాలు కొలువుదీరాయి. టీఎంసీ నేతలు, గూండాల బెదిరింపుపై మహిళలు వీధుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు పొరపాటున గెలిస్తే తమ ఇండ్లను దహనంచేయడం ఖాయమని, రక్తపాతం తప్పదని ఒక మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.
టీఎంసీకి చెందిన ఇస్రాఫిల్ చౌకిదార్ తమను బెదిరిస్తున్నాడని, తాము టీఎంసీకి ఓటేసినప్పటికీ వేధింపులు తప్పడం లేదని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టీఎంసీ చౌకిదార్ను అరెస్టు చేసి, తమకు రక్షణ కల్పించాలని పలువురు మహిళలు కోరారు. మరో గ్రామంలో స్థానిక టీఎంసీ నేత బైకులపై వచ్చి తమను బెదిరించారని తెలిపారు. వాళ్లు తమ గ్రామంపై దాడి చేసి, హత్యలు చేసే అవకాశం కూడా ఉందని వారు అంటున్నారు.
ఒక పక్క బెంగాల్లో భారీ స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించినప్పటికీ అనేక చోట్ల హింస, ఆందోళనలు ఆగడం లేదు. పశ్చిమ బెంగాల్లోని ఒక స్ట్రాంగ్ రూమ్ను అనుమతి లేకుండా కొందరు తెరిచారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు అధికారుల్ని ఈసీ సస్పెండ్ చేసింది. మే 4, సోమవారం ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. రెండో దశ పోలింగ్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మగ్రాహత్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని 15 బూత్లలో తిరిగి పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ నిరసన చోటుచేసుకుంది.
ఎన్నికల అవకతవకలు జరిగినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో, ఒక రోజు క్రితం తిరిగి పోలింగ్కు ఆదేశించిన డైమండ్ హార్బర్లోని నాలుగు పోలింగ్ కేంద్రాలతో పాటు, మగ్రాహత్ పశ్చిమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ దాదాపు ప్రశాంతంగానే కొనసాగుతోంది. అయితే, డైమండ్ హార్బర్ స్థానంలోని చందా ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న బూత్ నంబర్ 179లో, ఒక దివ్యాంగుడైన ఓటరును, అతని తల్లిని కేంద్ర బలగాలు వేధించాయని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు నిరసనలు చేపట్టారు. నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై, ఓటరుకు సహాయం చేయడానికి బూత్లోకి ప్రవేశించిన అతని తల్లిని, ఆమె కుమారుడిని కేంద్ర బలగాలు చాలా సేపు నిర్బంధించాయని టీఎంసీ పేర్కొంది. “టీఎంసీ నాయకులు మన్మోహిని బిస్వాస్, ప్రతీక్ ఉర్ రెహమాన్ ఘటనా స్థలానికి చేరుకుని నిరసనలకు నాయకత్వం వహించగా, స్థానికులు ఈ చర్యను అనవసర వేధింపుగా అభివర్ణించారు. అక్కడి మా అధికారులు ఈ విషయాన్ని చక్కబెట్టారు,” అని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.

More Stories
అలర్ట్ సిస్టమ్ తో దేశవ్యాప్తంగా మోగిన మొబైల్ ఫోన్లు!
మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
బీజేపీలో చేరిన సందీప్ పాఠక్పై పంజాబ్ లో రెండు కేసులు