పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు

పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు
గత నెల 24న బాపట్ల జిల్లాకు సంబంధించిన ఓ చర్చి, పాస్టర్‌కు సంబంధించిన కేసులో కీలక క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో,  సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు తగిన విధంగా బాపట్లకు చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ పాల్ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దుకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. 

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో బాపట్ల జిల్లా రెవెన్యూ విభాగం పాస్టర్ ఆనంద్‌ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు అంశంపై ఈ నెల 16న తొలిసారి విచారణ చేయగా, ఈ విచారణకు పాస్టర్ ఆనంద్ హాజరుకాలేదు. పిటిషనర్‌ రామిరెడ్డి మాత్రం హాజరయ్యారు. స్థానిక తహసీల్దార్‌, బాపట్ల ఆర్డీవోలు విచారణలో పాల్గొన్నారని చెబుతున్నారు. 

ఈ సర్టిఫికెట్‌కు సంబంధించిన అంశంప మరో రెండుసార్లు విచారణ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎస్సీ హోదా రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే పాస్టర్ చింతాడ ఆనంద్ గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇటీవల పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ బాపట్ల జిల్లా కలెక్టర్, ఏపీ సీఎస్‌కు లేఖ రాసినట్లు తెలిపింది. 
 
పాస్టర్‌కు జారీ చేసిన ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని తక్షణమే రద్దు చేయాలని, అక్రమంగా ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టి పొందిన నష్టపరిహారాన్ని తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. గతంలో పాస్టర్‌కు ఎస్సీ ధృవీకరణ పత్రం జారీ చేసిన తహశీల్దార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.  అంతేకాదు ఈ కేసుకు సంబంధించి పాస్టర్ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని అక్కల రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 
 
అలాగే తనపై నమోదైన కేసులో నిబంధనలు ఉల్లంఘించిన అప్పటి తహసీల్దార్‌, ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్‌, డీఎస్పీ, ఎస్సైలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 24న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేయగా పాస్టర్ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దుపై తీసుకున్న చర్యలేమిటో వివరించాలని హైకోర్టు బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణ జూన్‌ 16కు వాయిదా వేసింది.
 
ఇదిలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్ల ఎస్సి కుల ధ్రువీకరణ పాత్రలను రద్దు చేయాలని  షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టును ఆశ్రయించారు. 2021లో బాపట్ల జిల్లా పట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంలో ఓ చర్చి నిర్మాణం విషయంలో పాస్టర్ ఆనంద్, స్థల యజమాని రామిరెడ్డి మధ్య వివాదం జరిగింది. 
 
ఈ క్రమంలో రామిరెడ్డి కులంపేరుతో తనను దూషించి, దాడి చేశారని పాస్టర్ చింతాడ ఆనంద్‌ చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు రామిరెడ్డితో పాటుగా మరికొందరిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 
 
అయితే పాస్టర్ చింతాడ ఆనంద్ క్రైస్తవ మతబోధనలు చేస్తున్నారని, అలాంటప్పుడు ఆయన అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుందని బాపట్ల కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో, చివరిగా సుప్రీం కోర్టులో పిటిషన్లు వరుసగా దాఖలు చేశారు.  ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇస్తూ మతం మారిన వారికి ఎస్సీ హోదా కోల్పోతారని స్పష్టం చేసింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.