బీజేపీకిలో చేరిన ఏడుగురు రాజ్యసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్కు ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వినతిపత్రం అందజేశారు. ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
‘‘ఆ ఏడుగురు ఆప్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆప్ను వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారిని అనర్హులుగా ప్రకటించి, సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్ను వినతిపత్రం అందజేశాం. ఇటువంటి చర్యలు ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం’’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
“ఇటువంటి ఫిరాయింపులు ముఖ్యంగా పంజాబ్లో ప్రజల తీర్పుకు ద్రోహం చేయడమే కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం” అని ఆయన ఆరోపించారు. పార్టీని వీడిన ఏడుగురిలో ఆరుగురు పంజాబ్ కు చెందినవారే. ఇది పంజాబ్ ప్రజలకు, అలాగే భారత రాజ్యాంగానికి చేసిన ద్రోహం అని విమర్శించారు. అంతేకాదు, ఈ అంశంపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ పీడీటీ ఆచార్య సహా పలువురు రాజ్యాంగ నిపుణులను తాము సంప్రదించినట్టు తెలిపిన ఆయన చట్టప్రకారం వారు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఇదిలా ఉండగా, బీజేపీలో చేరిన ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యుల్లో ఒకరైన హర్భజన్ సింగ్కు పంజాబ్ ప్రభుత్వం గతంలో కేటాయించిన భద్రతను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. భజ్జీకి 9- 10 మంది పోలీసులతో కూడిన భద్రతను తొలగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే జలంధర్ ఛోటీ బారాదరీ ప్రాంతంలో ఉన్న హర్భజన్ ఇంటి వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరించారు.
ఆయన బీజేపీలోకి ఫిరాయించడాన్ని నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు హర్భజన్ నివాసం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. రాఘవ్ చద్ధా, సందీప్ పాఠక్, అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్జిత్ సాహ్నీ బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ సిద్ధాంతాలు, మౌలిక సూత్రాల నుంచి దూరంగా జరగడంతోనే తాను ఆప్ను వీడుతున్నట్టు చద్ధా ప్రకటించారు.
పార్టీ వీడటానికి పంజాబ్లో రుణ భారం, రైతుల సమస్యలు, డ్రగ్స్ను నియంత్రించడంలో విఫలం కావడం వంటి పాలనాపరమైన ఆందోళనలు, నాయకత్వంతో సంప్రదింపులు జరపడానికి అవకాశం లేకపోవడం వంటి కారణాలను సాహ్నీ ప్రస్తావించారు. రాజకీయ ఒత్తిడి, అంతర్గత అసంతృప్తి ఆరోపణల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల గురించి నాయకత్వానికి ముందే తెలుసని, కనీసం కొంతమంది ఎంపీలు పార్టీని వీడకుండా నిరోధించడానికి చివరి నిమిషంలో ప్రయత్నాలు చేసిందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
ఎంపీలు లేదా ఎమ్మెల్యేల రీకాల్కు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేనప్పటికీ, ఈ అంశంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి సమయం కోరారు.

More Stories
ఆప్ ఎంపీల ఫిరాయింపు ఆ పార్టీ విచ్ఛిన్నంకు నాంది?
అముద్రిత పుస్తకంపై అనవసరంగా వివాదంలోకి లాగారు!
మొదటి దశలో టీఎంసీ అహంకు దెబ్బ, రెండో దశలో బిజెపి విజయం