పశ్చిమ బెంగాల్కు చెందిన మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు దినేష్ త్రివేది బంగ్లాదేశ్కు భారత తదుపరి హైకమిషనర్గా నియమితులయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు ధృవీకరించాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఢాకాలోని ఈ కీలక దౌత్య పదవికి రాజకీయ నియామకం జరగడం ఇటీవలి కాలానికి భిన్నంగా ఉంటుంది.
ఎన్నికల అనంతరం ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల ప్రారంభంలో, సెప్టెంబర్ 2022 నుండి ఢాకాలో భారత హైకమిషనర్గా పనిచేస్తున్న 1994 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ప్రణయ్ వర్మ, బెల్జియం, యూరోపియన్ యూనియన్కు తదుపరి రాయబారిగా నియమితులయ్యారు.
అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, బీజేపీ సమాచార, సాంకేతిక శాఖ అధిపతి, పార్టీ పశ్చిమ బెంగాల్ విభాగానికి సహ-ఇన్చార్జ్గా ఉన్న అమిత్ మాల్వీయా ఆదివారం త్రివేదికి అభినందనలు తెలిపారు. “బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, బ్యారక్పూర్ ఎంపీ అయిన దినేష్ త్రివేది బంగ్లాదేశ్కు భారత హైకమిషనర్గా నియమితులైనందుకు అభినందనలు” అని ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్లో పేర్కొన్నారు.
మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కూడా Xలో ఒక పోస్ట్లో త్రివేదికి అభినందనలు తెలిపారు. “ఆయన తనతో పాటు విలువైన అనుభవాన్ని, పరిపాలనపై లోతైన అవగాహనను, విధానపరమైన విషయాల పట్ల సమతుల్య దృక్పథాన్ని తీసుకువస్తారు. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ సమయంలో, మన బంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయన అర్థవంతంగా దోహదపడతారని నేను విశ్వసిస్తున్నాను” అని ఆయన తెలిపేరు.
మాజీ కేంద్ర రైల్వే మంత్రిగా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన త్రివేదికి పార్లమెంటేరియన్గా దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయనకు 2016లో ‘అత్యుత్తమ పార్లమెంటేరియన్’ అవార్డు లభించింది. విద్యార్థి రాజకీయాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ సభ్యుడిగా ఉన్నారు. 2021లో బీజేపీలో చేరడానికి ముందు ఆయన కాంగ్రెస్, జనతా దళ్, తృణమూల్ కాంగ్రెస్లలో పనిచేశారు.
ఈ నెల మొదట్లో, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ పర్యటన సందర్భంగా ఢాకాలోని కొత్త ప్రభుత్వం ఢిల్లీలో జరిపిన మొట్టమొదటి ఉన్నత స్థాయి రాజకీయ సంప్రదింపుల కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, “కొత్త ప్రభుత్వంతో నిర్మాణాత్మకంగా కలిసి పనిచేయడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం ఆసక్తిగా ఉంది” అని పునరుద్ఘాటించారు.
షేక్ హసీనా, ఆమె హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్లను బంగ్లాదేశ్కు అప్పగించాలని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అభ్యర్థనను పునరుద్ఘాటించింది. విస్తృత నిరసనల అనంతరం పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టు నుంచి ఢిల్లీలో ఉన్నారు.

More Stories
ఐఆర్జీసీ నియంత్రణలోకి ఇరాన్ సైనిక, దౌత్యపర నిర్ణయాలు!
అమెరికాతో రెండో విడత చర్చలకు ఇరాన్ దూరం
శ్రీలంక అధ్యక్షుడితో ఇంధన భద్రతపై ఉపరాష్ట్రపతి చర్చలు