తెలంగాణ బీసీల్లో అత్యధికులు ముస్లింలే

తెలంగాణ బీసీల్లో అత్యధికులు ముస్లింలే
తెలంగాణ బీసీ జనాభాలో అత్యధికంగా బీసీ ‘ఈ’ క్యాటగిరీలోని షేక్‌లే అగ్రస్థానంలో నిలిచారు. బీసీల మొత్తం జనాభాలో ముస్లింలు 27,95,727 మంది (7.9%) ఉన్నారు. ఆ తరువాత ముదిరాజ్‌ జనాభా అత్యధికంగా ఉన్నది. చేసింది. నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి హడావుడిగా రాష్ట్రంలో ప్రతి కులం, జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని వెల్లడించింది.
 
తెలంగాణ బడుగుబలహీన వర్గాల్లో మిగతా అన్ని ఉప కులాలకన్నా ముస్లింలే అత్యధికంగా ఉన్నారని ప్రకటించడం విస్మయం కలిగిస్తుంది. అసలు ముస్లింలను బీసీలుగా పరిగణించడాన్నే బడుగులు వ్యతిరేకిస్తుంటే, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏకంగా అధికసంఖ్యాక బడుగులు ముస్లింలేనని ప్రకటించడం మరింత విడ్డూరం.  
గౌడన్నలు, నేతన్నలు, ముదిరాజన్నలు, గొల్లకురుమలు, మున్నురుకాపులు తదితర సబ్బండ వర్గాలు తెలంగాణలో బలహీన వర్ణాలు గొంతుకలై ప్రతిధ్వనిస్తూ తమ అస్తిత్వంకోసం, రాజకీయాల్లో తమ వాటా కోసం దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుంటే వారందరిపై పిడుగుపాటుగా, శరాఘాతంలా తెలంగాణలో అత్యధికసంఖ్యలో ఉన్న బీసీ వర్గం ముస్లింలేనని రేవంత్‌ సర్కార్‌ చిమ్మ చీకటిలో ప్రకటించడం గమనార్హం. 

రాష్ట్రంలో రేవంత్‌ సర్కార్‌ చేపట్టిన కులగణన అసలేమాత్రం సజావుగా సాగలేదని, ప్రతి దశలోనూ ఇది లోపభూయిష్టంగానే జరిగిందని సర్వే సమయంలోనే అనేక ఆరోపణలు, అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అవన్నీ అక్షరాలా నిజమేనని సర్వే గణాంకాలు ఇప్పుడు స్పష్టంగా నిరూపించాయి. తెలంగాణ ప్రభుత్వం గత నవంబర్‌లో రాష్ట్రంలో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే- 2024) నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 1,12,36,849 కుటుంబాలను (97.10%) సర్వే చేసింది.

మొత్తం 3,55,50,759 జనాభా వివరాలు సేకరించింది. ఆ సర్వే గణాంకాల విశ్లేషణ కోసం జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది.  ఆ కమిటీ ఇప్పటికే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక గణాంకాలను మంత్రి పొన్నం ప్రభాకర్‌ సచివాలయంలో బుధవారం విడుదల చేశారు. అంతేకాదు, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని వెల్లడించారు. 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే డాటాను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మైనారిటీ బీసీలు కలుపుకొని మొత్తంగా బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.08%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%, నో క్యాస్ట్‌ 4%మంది ఉన్నారని వెల్లడించారు. సర్వే వివరాలు WWW.des.telangana.gov.in లో ఉన్నాయని తెలిపారు. 
 
బీసీల్లో షేక్‌లు 7.9%, ముదిరాజ్‌ 7.4%, యాదవ 5.7%, గౌడ్‌ 4.6%, మున్నూరుకాపు 3.9% ఉన్నట్టు తేల్చింది. ఎస్సీ జనాభాలో మాదిగలు 10.3%, మాలలు 4.1% ఉన్నట్టు వెల్లడించింది. ఎస్టీల్లో అత్యధికంగా లంబాడీ/సుగాలి అత్యధికంగా 6.8% ఉన్నట్టు పేర్కొన్నది.  ఓసీల్లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం 4.8% ఉండగా, ఆ తరువాతి స్థానంలో ఓసీ ముస్లీంలు 1.8% ఉన్నారు. వైశ్యులు 1.4%, కమ్మ 1%, బ్రాహ్మణులు 0.9%, కాపులు 0.7%, వెలమలు 0.4% ఉన్నట్టు వెల్లడించింది. 

ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా వెనుకబడి ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఉన్నారు. బీసీల్లో అత్యధికంగా లబ్ధిపొందుతున్నది కేవలం ఐదు కులాలేనని నివేదిక తేల్చింది. ముదిరాజ్‌, యాదవ, మున్నూరుకాపులు జనాభాతోపాటుగా రాజకీయంగా బలంగా ఉన్నట్టు తెలిపింది.  బీసీ ఈ క్యాటగిరీలో షేక్‌లు అత్యధికంగా ఉన్నారని వివరించింది. గౌడ, పద్మశాలీ, కురుమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలమైన స్థానాన్ని కలిగి ఉన్నారని నివేదించింది. మొత్తం గా షేక్‌, ముదిరాజ్‌, యాదవ, గౌడ్‌, మున్నూరుకాపులో బీసీ జనాభాలో 30% ఉన్నారని తేల్చింది.

రాష్ట్రంలో మొత్తం కులాలు 242 ఉన్నట్టు ప్రభుత్వం లెక్క తేల్చింది. బీసీ క్యాటగిరీలో మొత్తం 133 కులాలు ఉండగా, ఇందులో 69 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని, 64 కులాల్లో తక్కువ వెనుకబాటు తనం ఉన్నదని తేల్చింది.  ఎస్సీ క్యాటగిరీలో 59 కులాలు ఉండగా ఇందులో 41 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నట్టు పేర్కొన్నది. ఎస్టీల్లో 32 కులాలు ఉండగా 25 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలిపింది. ఓసీ క్యాటగిరీలో మొత్తం 18 కులాలు ఉండగా, అందులో ఒక్క కులం కూడా అత్యంత వెనుకబడిన క్యాటగిరీలో లేకపోవడం గమనార్హం.