మహిళల సాధికారతకు మద్దతుగా బీజేపీ స్కూటీ ర్యాలీ

మహిళల సాధికారతకు మద్దతుగా బీజేపీ స్కూటీ ర్యాలీ

భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మహిళల సాధికారతకు మద్దతుగా, అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా, బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా, యువమోర్చాలో ఆధ్వర్యంలో స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు   హాజరయ్యారు.

ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు, యువతీయువకులు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  రాంచందర్ రావు మాట్లాడుతూ  మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అంశం గత 30 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని, యూపీఏ ప్రభుత్వ కాలంలో కాంగ్రెస్, మిత్రపక్షాల ఒత్తిడితో ఈ బిల్లును ముందుకు తీసుకురాలేదని విమర్శించారు.

అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, అన్ని పార్టీలను ఒప్పించి పార్లమెంటులో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లును ఆమోదింపజేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు అమలుకు అడ్డంకులు సృష్టించేలా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.  ఈ బిల్లు అమలవకుండా చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇండియా కూటమి పార్టీలు కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాయడం పూర్తిగా తప్పుడు ప్రచారం అని పేర్కొంటూ దేశాన్ని విభజించే రాజకీయాలకు దారి తీసే చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాసిన లేఖే కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేస్తోందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.