అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ నీటిలో మునిగిపోయింది ఈ ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది.
ప్రమాదానికి గురైన పడవ దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్నాఫ్ ప్రాంతం నుంచి బయలుదేరినట్లు ఐక్యరాజ్య సమితి తన ప్రకటనలో పేర్కొన్నది. పడవ బంగ్లాదేశ్ నుంచి మలేసియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా మునిగినట్లు వెల్లడించింది. అదేవిధంగా పడవలో పరిమితికి మించి జనం ఎక్కడం కూడా ప్రమాదానికి మరో కారణమై ఉండవచ్చని తెలిపింది.
మునిగిన పడవ ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. కాక్స్ బజార్లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేసియాకు వలస వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదానికి గురైనట్లు ఐక్యరాజ్యసమితి అధికారులు వెల్లడించారు. వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్కు చెందినవారు. కానీ 2017లో అక్కడి సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది మంది బంగ్లాదేశ్కు తరలిపోయారు.
ఇదే సమయంలో, రోహింగ్యా సమస్య తీవ్రతను కూడా ఐరాస ప్రస్తావించింది. మయన్మార్లో కొనసాగుతున్న హింస, రఖైన్ రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు క్షీణించడం వల్ల రోహింగ్యాల స్వదేశానికి తిరిగి వెళ్లే అవకాశాలు తగ్గిపోయాయని పేర్కొంది. మరోవైపు బంగ్లాదేశ్లోని శరణార్థి శిబిరాల్లో జీవన పరిస్థితులు కష్టతరంగా మారడంతో వారు ఇలాంటి ప్రమాదకర సముద్ర ప్రయాణాలకు దిగుతున్నారని వివరించింది.
ప్రత్యేకంగా కాక్స్ బజార్లో ఉన్న శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోవడం, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, విద్యా సదుపాయాలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన జీవితం కోసం మలేసియా వంటి దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయాణాల్లో మానవ అక్రమ రవాణా ముఠాలు వారిని మోసం చేస్తూ ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని ఐరాస హెచ్చరించింది.

More Stories
మెటా, గూగుల్, ఎక్స్, రెడ్డిట్ లకు నోటీసులు
ఏప్రిల్ 20 వరకు వడగాలులు
మహారాష్ట్రలో రిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ రావాల్సిందే